హైదరాబాద్: క్రికెట్ దిగ్గజం, సీనియర్ క్రికెటర్, టీమిండియా మాజీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ మంచికిపోయినా చెడు ఎదురైనట్టైంది. సచిన్ మానవత్వంతో చేసిన ఓ మంచి పనిని కూడా కొందరు పనిగట్టుకొని విమర్శిస్తున్నారు. ఇంతకు రోడ్డు భద్రతను సూచిస్తూ.. టూ వీలర్పై డ్రైవింగ్ చేసే వాళ్లతో పాటుగా వెనుక కూర్చున్న వాళ్లు కూడా హెల్మెట్ పెట్టుకొమ్మంటూ చెప్పాడు. ఇలా పలు సామాజిక అంశాలపై అభిమానులకు అవగాహన కల్పిస్తూ.. ఉన్నాడు.
ఇటీవల గాయాలతో, తీవ్ర దప్పికతో ఎగరలేని స్థితిలో ఉన్న ఓ పక్షి సచిన్ ఇంటి బాల్కనీలోకి వచ్చింది. ఈ పక్షిని చూసి చలించిపోయిన ఈ దిగ్గజ క్రికెటర్ దానికి నీరు, ఆహారం అందించారు. అయితే అది చికెన్ తింటుందా, బ్రెడ్ తింటుందా అని ఒకింత అయోమయానికి కూడా గురయ్యారు. చివరకు దానికి ఆహారం, నీరు ఏర్పాటు చేశాడు. అప్పుడు కూడా ఆ పక్షి ఎగురలేకపోయింది.
ఆ పక్షి తీవ్రంగా గాయపడిందని గ్రహించిన సచిన్.. జంతువులను సంరక్షించే ఓ ఎన్జీవోకు సమాచారమిచ్చాడు. దానికి సరైన వైద్యం అందించి ఎగురేలా చేశాడు. దీన్నంతా స్వయంగా వీడియోతీసిన సచిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు ఫిదా అయినా అభిమానులు కొందరు సచిన్పై ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు మాత్రం పనిగట్టుకోని విమర్శలు గుప్పిస్తున్నారు.
మీరు చేసిన పనికి అభిమానిగా గర్విస్తున్నామని ఒకరు కామెంట్ చేయగా.. 'ఇలానే అన్ని జీవులపై ప్రేమ చూపించండి. చేపలు, చికెన్, మటన్ తినడం మానేసి శాకహారిగా ఉండండి. అలాగే మీ హోటళ్లో కూడా శాకహారమే పెట్టండి' అని ఇంకోకరు సెటైర్ వేసారు.