
హైదరాబాద్: 1991-92 సీజన్లో తన తొలి ఆస్ట్రేలియా పర్యటన ఎంతో నేర్పిందని టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తెలిపాడు. ప్రస్తుతం భారత్ ఆసీస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అడిలైడ్లో జరిగిన తొలి టెస్టు (డే/నైట్)లో భారత్ ఘోర పరాభవం పాలైన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన సచిన్.. ఆ పర్యటన తనకు టెక్నికల్ విషయాలపైనే కాకుండా మానసికంగా ఎలా సన్నద్ధమవ్వాలో నేర్పిందని చెప్పాడు.
అప్పట్లో చాలా మంది పేస్, బౌన్స్ గురించి మాట్లాడేవారని.. ఒక బౌలర్ అలా బంతులేయాలంటే కచ్చితమైన లెంగ్త్ అవసరమని క్రికెట్ దిగ్గజం సచిన్ చెప్పాడు. దానికి ఆ బౌలర్ పిచ్ మీద నిర్దిష్టమైన ప్రాంతం కనుగొనాలని అదెంతో కష్టతరమైన విషయమన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాట్స్మెన్ సానుకూల ధోరణితో ముందుకు సాగితే పరుగులు చేయడానికి చాలా అవకాశాలుంటాయని తెలిపాడు. తాను అలానే చేసేవాడినని చెప్పాడు. మొదట్లో తాను కూడా బంతిపై ప్రతాపం చూపేవాడినని, సమయం గడిచేకొద్దీ తన పరిణతి పెరిగిందని సచిన్ తెలిపాడు.
ఎప్పుడూ బంతిపై ఎదురుదాడి చేయడం కాకుండా, పరిస్థితులను అర్థం చేసుకొని బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చెప్పాడు. పేస్ను బట్టి షాట్లను ఎంపిక చేసుకోవాలని, ఒక్కోసారి ఆ షాట్లు కుదరకపోయినా అలాగే ప్రయత్నించేవాడినని చెప్పుకోచ్చాడు. ఈ క్రమంలోనే తాను 1991-92లో ఆడేటప్పుడు తనని ఎవరూ టీనేజ్ కుర్రాడిలా చూసేవారు కాదని, ఎంతసేపూ పెవిలియన్ పంపడానికి విశ్వప్రయత్నాలు చేసేవారని సచిన్ గుర్తుచేసుకున్నాడు. తాను కూడా అలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేవాడినని చెప్పాడు.
ఆ పర్యటన తనని టెక్నికల్గానే కాకుండా పెద్ద టోర్నీల్లో మానసికంగా ఎలా ఆడాలో తెలియజేసిందని సచిన్ టెండూల్కర్ వివరించాడు. కాగా సచిన్ నాటి 5 టెస్టుల పర్యటనలో రెండు శతకాలు బాదాడు. సిడ్నీలో 148 బాదగా, పెర్త్లో 114 పరుగులు చేసి అందర్నీ ఆశ్యర్యంలో ముంచెత్తాడు. ఆ సిరీస్లో భారత్ 4-0 తేడాతో ఓటమిపాలైంది. తొలి టెస్టు తర్వాత విరాట్ కోహ్లీ భారత్కు తిరిగి వస్తుండడంతో పాటు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ సైతం గాయం కారణంగా మిగతా టెస్టులకు దూరమయ్యాడు. దీంతో రోహిత్ శర్మ చేరిక జట్టుకు ఎంతో అవసరంగా మారింది.