
క్రికెట్ చరిత్రలో సచిన్కు చెరగని పేజీలు
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు, అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు, అత్యధిక హాఫ్ సెంచరీలు, అత్యధిక బౌండరీలు, ఇంకెన్నో రికార్డులు వీటన్నింటి గూరించి చెప్పాలంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు. కానీ ఈ రికార్డులన్ని సాధించింది ఎవరంటే మరో ఆలోచన లేకుండా టక్కున గుర్తొచ్చే పేరు సచిన్ రమేష్ టెండూల్కర్. అంతర్జాతీయ క్రికెట్ను రెండు దశాబ్దాలకు పైగా శాసించిన వీరుడు. క్రికెట్ చరిత్రలో తనకంటూ చెరగని పేజీలు లిఖించుకున్న మొనగాడు. క్రికెట్ అభిమానులు దేవుడిగా కొలిచిన గుడి లేని దేవుడు.

హింట్ ఇచ్చిన గంగూలీ
ఇలా ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న భారతరత్న గ్రహీత సచిన్ టెండూల్కర్ మళ్లీ టీమిండియాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా ప్రస్తుత బీసీసీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హింట్ కూడా ఇచ్చాడు. ఇటీవల బీసీసీఐ బాస్ బ్యాక్ స్టేజ్ విత్ బోరియా అనే ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అడిగిన ఓ ప్రశ్నకు గంగూలీ సమాధానమిచ్చాడు.
సచిన్ టెండూల్కర్ అందరి కంటే భిన్నమైన వ్యక్తి అని ఆయన చెప్పాడు. ప్రస్తుతం టీమిండియాకు ఎలాంటి సేవలు అందించే ఆలోచనలో సచిన్ లేడని చెప్పాడు. కానీ భారత క్రికెట్కు సచిన్ అవసరం కచ్చితంగా ఉందని ఆయన తెలిపాడు. అయితే ఏదో ఒక రోజు సచిన్ కూడా భారత జట్టుకు తన సేవలందించాల్సిన సమయం వస్తుందని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎందుకంటే సచిన్ లాంటి గొప్ప ఆటగాళ్లు భారత జట్టుతో ఉండడం ఎంతో అవసరం అని అన్నాడు.
అయితే సౌరవ్ గంగూలీ చెప్పిన దాని బట్టి ఇప్పటికిప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు సచిన్ టెండూల్కర్ టీమిండియా బ్యాకప్ స్టాఫ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే గంగూలీ ఇలా వ్యాఖ్యానించాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం క్రికెట్కు దూరంగా సచిన్
2013లో క్రికెట్కు వీడ్కోలు పలికాక సచిన్ టెండూల్కర్ ఆటకు దూరంగానే ఉంటున్నాడు. రిటైర్ అయిన ఆటగాళ్లు అంతా పలు జట్లతో కోచింగ్ బృందంలో లేదా కామెంటేటర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే సచిన్ ఆ దిశగా అడుగులు వేయలేదు. తనకు నచ్చిన విధంగా లైఫ్ను ఎంజాయ్ చేస్తూ గడిపేస్తున్నాడు. ఐపీఎల్లోని ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటర్గా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టడం లేదు.

టీమిండియా సేవల్లో బిజీగా సచిన్ సహచరులు
సచిన్ ఆడుతున్నంత కాలం ఆయనతో కలిసి ఆడిన ఆటగాళ్లు అంతా మళ్లీ క్రికెట్లోనే ఏదో ఒక విధంగా స్థిరపడ్డారు. ముఖ్యంగా సచిన్తో సుదీర్ఘ కాలం కలిసి ఆడిన రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టుకు విశేష సేవలు అందిస్తున్నారు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా విధులు నిర్వర్తిస్తుండగా, రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్ కోచ్గా పనిచేస్తున్నాడు.
వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏ హెడ్ ఉన్నాడు. ద్రావిడ్, లక్ష్మణ్ భారత జట్టులో చేరడంలో గంగూలీ కృషి ఎంతో ఉంది. అలాగే సచిన్ టెండూల్కర్ను కూడా భారత జట్టులో చేర్చడానికి గంగూలీ ప్రయత్నిస్తున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే టీవీ షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అయితే సచిన్ టెండూల్కర్ భారత జట్టులో చేరుతాడా లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.


Click it and Unblock the Notifications












