హైదరాబాద్: గత కొంతకాలంగా శ్రీలంక జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నా ఆ జట్టు వెటరన్ స్పిన్నర్ రంగనా హెరాత్ మాత్రం సంచలన ప్రదర్శన చేస్తూనే ఉన్నాడు. పాకిస్థాన్తో అబుదాబి వేదికగా జరిగిన తొలి టెస్టులో మొత్తం 11 వికెట్లు (రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి) తీసి రంగనా హెరాత్ టెస్టుల్లో 400 వికెట్ల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే.
84 టెస్టుల్లో 27.82 యావరేజితో హెరాత్ ఈ వికెట్లను సాధించడం విశేషం. క్రికెట్ చరిత్రలో మురళీధరన్, వార్న్, కుంబ్లే, హర్భజన్ తర్వాత ఈ మైలురాయి అందుకున్న ఐదో స్పిన్నర్. అంతేకాదు ఈ మైలురాయి చేరుకున్న తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించిన 14వ బౌలర్ కూడా.

తొలి టెస్టులో ఓటమి తప్పదనుకున్న శ్రీలంక.. అనూహ్య విజయం సాధించి రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. 'టెస్టుల్లో 400 వికెట్లు తీసి అద్భుతమైన ఘనతని అందుకున్న శ్రీలంక నిశబ్ద యోధుడు.. రంగనా హెరాత్కి అభినందనలు' అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో సెప్టెంబరు 22, 1999న అరంగేట్రం చేశాడు.