
ముంబై: టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. నిన్ను చూసి గర్వపడుతున్నా అంటూ కొనియాడారు. చెన్నైలో ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చెపాక్ మైదానంలో తొలి టెస్టులో ఎదురైన ఓటమికి రెండో టెస్టులో 317 పరుగుల తేడాతో గెలుపొంది బదులు తీర్చుకుంది. ఇక మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సొంత మైదానంలో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో శతకం పూర్తికాగానే హెల్మెట్ తీసి అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు.
మరో ఎండ్లో అతడికి సహకారం అందించిన మొహ్మద్ సిరాజ్ సైతం సంబరంతో గాల్లోకి పంచ్లు విసురుతూ అంతే ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదే విషయంపై తాజాగా స్పందించిన సచిన్.. సిరాజ్ చేసిన పనికి ఆనందించడమే కాకుండా అభినందించాడు. బుధవారం రాత్రి ఓ ట్వీట్ చేసిన మాస్టర్ బ్లాస్టర్.. సిరాజ్ను ప్రశంసలతో ముంచెత్తాడు.
'ఇంగ్లండ్తో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆర్ అశ్విన్ సెంచరీ చేసినప్పుడు మొహ్మద్ సిరాజ్ సంబరాలు చూడ్డానికి ఎంతో ఆసక్తిగా అనిపించాయి. వాటినెంతో ఆస్వాదించా. జట్టుగా ఆడే ఆటలో ఇలాంటివే ఉంటాయి. తోటి ఆటగాళ్ల ఘనతల్ని ఆస్వాదిస్తూ అందులో పాలుపంచుకోవడమే. భారత్, సిరాజ్ పట్ల గర్వపడుతున్నా' అని సచిన్ పేర్కొన్నారు. ఆనాటి వీడియోను సైతం అభిమానులతో పంచుకున్నారు. దీనికి అశ్విన్ సైతం జవాబిచ్చాడు. సిరాజ్ జట్టు కోసం ఆడే ఆటగాడని మెచ్చుకున్నారు.
90 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా సిరాజ్ తన వద్దకొచ్చి మాట్లాడాడని అశ్విన్ గుర్తుచేసుకున్నాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో అభిమానులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. సిరాజ్ చివరివరకూ క్రీజులో ఉంటాననే భరోసా ఇచ్చాడని చెప్పాడు. ఆ మ్యాచ్లో అశ్విన్ (79) పరుగులతో బ్యాటింగ్ చేస్తుండగా సిరాజ్ పదో వికెట్గా క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ 49 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. చివరికి అశ్విన్(106) శతకం పూర్తి చేసుకున్నాక స్టోన్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. ఇక బౌలింగ్లో తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్లో మరో మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో మొత్తంగా 8 వికెట్లతో పాటు శతకం సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే అతడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు.