హైదరాబాద్: తన జీవితం ఆధారంగా రూపొందించిన 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమాలోని ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ మరోసారి దగ్గరుండి చూసినట్లు అనిపించిందని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చెప్పాడు. 'నా దృష్టిలో క్రికెట్ ఆడటం అంటే గుడికి వెళ్లడంతో సమానం' అని తన క్రికెట్ గురించి సచిన్ చెప్పిన మాట.
సచిన్ జీవిత విశేషాలతో రూపొందించిన 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ను గురువారం ముంబైలోని జుహు ఆడిటోరియంలో ఆవిష్కరించిన సందర్భంగా సచిన్ పై వ్యాఖ్యలు చేశాడు. సచిన్ స్వయంగా విడుదల చేసిన ఈ ట్రైలర్ కొద్ది సేపట్లోనే సంచలనం సృష్టించింది.

ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ 'ఈ సినిమా నిర్మాణం ద్వారా నా జీవితంలోని ముఖ్య ఘట్టాల్ని ఆస్వాదించే అవకాశం దక్కింది. నేను సాధారణంగా వ్యక్తిగత విషయాలు ఎవరికీ చెప్పుకోను. అయితే నా జీవితంలోనూ కొన్ని అపురూప ఘట్టాలు ఉన్నాయి. నా అభిమానులకు అవి ఆసక్తికరం. నేను ఇబ్బందిగా భావించని పలు విషయాలను ఇందులో పంచుకున్నాను' అని సచిన్ అన్నాడు.
'నా మీద ఎనలేని ప్రేమ చూపించి, నన్ను ఆశీర్వదించిన అభిమానులు నా ప్రయాణాన్ని 24 ఏళ్ల పాటు నన్ను తమవాడిగా చూసుకున్న భారతీయులందరికీ ఈ చిత్రం మరింత ఆనందం పంచుతుందని ఆశిస్తున్నాను' అని సచిన్ ఉద్వేగంగా చెప్పాడు. సుదీర్ఘ కెరీర్లో సచిన్ను ప్రత్యేకంగా నిలబెట్టిన క్రికెట్ మ్యాచ్లు, విశేషాలతో పాటు తన కుటుంబం, వ్యక్తిగత జీవితం కూడా ఈ సినిమాలో కనిపించనున్నాయి.
వీటితో పాటు సచిన్ ఆటగాడిగా ఉన్న సమయంలో చెలరేగిన మ్యాచ్ ఫిక్సింగ్ వివాదాన్ని కూడా ఈ సినిమాలో ప్రముఖంగా ప్రస్తావించినట్లు ట్రైలర్లో అర్ధమవుతోంది. ఈ సినిమా దర్శకులు జేమ్స్ ఎర్స్కిన్, నిర్మాతలు రవి భగ్చంద్కా, శ్రీకాంత్ భసి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.