మెల్బోర్న్: ప్రపంచకప్లో భాగంగా ధోనీ సేన.. తొలుత పాకిస్తాన్తో, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో తలపడి రెండింట విజయం సాధించింది. ఈ విజయంతో భారత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి భారత్ చిన్నజట్లతోనే తలపడనుంది. భారత్ కలిసి కట్టుగా ఆడుతూ విజయం సాధిస్తుండటంతో ధోనీసేన పైన అభిమానులు మరిన్ని ఆశలు పెంచుకున్నారు. అయితే, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మాత్రం పూర్తిగా సంతృప్తి చెందడం లేదు.
భారత జట్టు ప్రదర్శన పైన సచిన్ సంతోషం వ్యక్తం చేసినప్పటికీ.. పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేయడం లేదు. ఇప్పటి వరకు బారత ప్రదర్శన చూస్తే సెమీస్ చేరుకునేందుకు మెరుగైన అవకాశముందని సచిన్ చెప్పాడు. భారత జట్టు ఆట తీరు పట్ల సంతోషంగా ఉన్నానన్నాడు. అయితే, ఇంతటితో సంతృప్తి చెందవలసిన పని లేదన్నాడు. ధోనీ సేన జోరు కొనసాగించాలన్నాడు.
భారత జట్టు ఆటగాళ్ల నైపుణ్యం గురించి, వారి సత్తా గురించి తనకు తెలుసునని చెప్పాడు. అందుకే జట్టు కచ్చితంగా సెమీస్ చేరుతుందనే నమ్మకం తనకు ఉందన్నాడు. ఇప్పటి వరకు భారత్ ఆట తీరు పట్ల సంతోషంగా ఉన్నానే తప్ప సంతృప్తిగా లేనని చెప్పాడు. వారు ఇంకా మెరుగుపడాలని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో శిఖర్ ధావన్, రహానేల పైన సచిన్ ప్రశంసలు కురిపించాడు.

మొదటి రెండు మ్యాచులలో ధావన్ తన సత్తా చాటాడని, మిగతా మ్యాచులలోను ఇదే ప్రదర్శన చేస్తాడని ఆశిస్తున్నానని చెప్పాడు. శిఖర్ ధావన్ మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడన్నాడు. తాను గతంలోనే చెప్పానని, ఇతను మంచి ప్లేయర్ అన్నాడు. రహానే మంచి షాట్స్ ఆడుతున్నాడని, సమయం చూసుకొని షాట్స్ కొడుతున్నాడని కితాబిచ్చాడు. డేల్ స్టెయిన్ బౌలింగులో కొట్టిన షాట్ అద్భుతమన్నాడు.
సునీల్ గవాస్కర్ ప్రశంసలు
ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికాను ఓడించి చరిత్ర సృష్టించిన టీమిండియాపై భార త మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంతటి భారీ విజయాన్ని తాను కలలో కూడా ఊహించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ 130 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
భారత ప్రదర్శనపై తనకు అపారమైన నమ్మకముందని, అయితే ఇంతటి భారీ విజయాన్ని అస్సలు ఊహించలేదని, డివిల్లీర్స్ సేనను 270-280 పరుగులకు పరిమితం చేసి, 30-40 పరుగుల తేడాతో గెలుస్తారనుకున్నానని, కానీ, భారత్ 130 పరుగుల భారీ తేడాతో నెగ్గిందన్నాడు.