
హైదరాబాద్: రాజ్యసభలో తొలిసారి తన గొంతుని వినిపించడానికి వచ్చిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్కు నిరాశే ఎదురైంది. 2012లో సచిన్ రాజ్యసభకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో గురువారం తానే స్వయంగా చర్చను ప్రారంభించేందుకు సచిన్ నోటీసులిచ్చాడు.
'రైట్ టు ప్లే అండ్ ఫ్యూచర్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ ఇండియా' అనే అంశంపై సచిన్ టెండూల్కర్ గురువారం రాజ్యసభలో ప్రసంగించేందుకు లేచిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అడ్డుతగిలి సచిన్ను మాట్లాడనివ్వకుండా చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఎంత సర్ది చెప్పినా వినలేదు.
దీంతో సుమారు 10 నిమిషాల పాటు మౌనంగా నిలుచున్న సచిన్ చివరకి కూర్చుండిపోయాడు. అయినా సరే కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు ఆపకపోవడంతో సభను శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. కాంగ్రెస్ నినాదాలు చేసేటప్పుడు సచిన్ మౌనంగా నిల్చున్నాడు.
రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కలగజేసుకుని సచిన్ను మాట్లాడనివ్వాల్సిందిగా సభ్యలను కోరారు. 'ప్రజలు చూస్తున్నారు, టెండూల్కర్ను మాట్లాడనివ్వండి. మనం క్రీడల గురించి చర్చించుకుంటున్నాం, కానీ మీకు క్రీడా స్ఫూర్తి అస్సలు లేదు' అని వెంకయ్య సభలోని కాంగ్రెస్ సభ్యులపై అసహనం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సభ్యుల గందరగోళం దేనికి?
అయితే ఇటీవల గుజరాత్ ఎన్నికల్లో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్పై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై కొన్ని రోజులుగా విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాజ్యసభ సమావేశం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేశారు. అయితే గురువారం సచిన్ మాట్లాడటానికి నిలబడినప్పుడే కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేయడం విమర్శలకు తావిస్తోంది.
ఇది విచారకరం: జయాబచ్చన్
పార్లమెంట్లో గురువారం జరిగిన సంఘటనలపై రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రికెట్తో భారత్కు పేరు తీసుకొచ్చిన సచిన్ను సభలో మాట్లాడనివ్వకపోవడం సరికాదని ఆమె న్నారు. ఈ రోజు ఎజెండాలో సచిన్ ప్రసంగం ఉందని తెలిసినా వారు ఇలా ప్రవర్తించడం విచారకరమని అన్నారు. రాజకీయనాయకులు మాత్రమే సభలో మాట్లాడాలా? అని ఆమె ప్రశ్నించారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.