
హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో మూడు వన్డేలు ఆడేందుకు భారత మహిళా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టును దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కలిశాడు.
సోమవారం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో వారితో ముచ్చటించాడు. సానుకూల దృక్పథంతో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాలని చెప్పాడు. అక్కడి పరిస్థితుల గురించి మరీ ఎక్కువగా ఆలోచించొద్దని టెండూల్కర్ వారికి సలహా ఇచ్చాడు.
పొరబాట్లను పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించాడు. అలా చేయడంతో ఒత్తిడి తగ్గి ఆటపై మరింత శ్రద్ధ పెట్టగలరని హితవు పలికాడు. కెప్టెన్ మిథాలీరాజ్తో పాటు ఇతర సభ్యులు సచిన్ను కలిశారు. ఫిబ్రవరి 5న కింబర్లీ అనే ప్రాంతం నుంచి ప్రారంభమయ్యే సఫారీ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది.
'ప్రపంచ కప్ తర్వాత మొదటి సిరీస్ ఆడుతున్న సందర్భంలో సచిన్ టెండూల్కర్ కలవడం ఎంతో ధైర్యాన్నిచ్చింది. దక్షిణాఫ్రికా పర్యటనలో మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు జట్టు తయారుగా ఉందంటూ మిథాలీ రాజ్ వెల్లడించింది.
హర్మన్ ప్రీత్ మాట్లాడుతూ.. 'అక్కడికి త్వరగా వెళ్లడంతో సఫారీ మైదానాలపై మాకు పట్టు పెరుగుతుంది. దానికి అనుగుణంగా మా ఆట తీరును మెరుగుపరుచుకోవడంతో వికెట్లు త్వరగా తీసే అవకాశం ఉందని పేర్కొంది. గతేడాది జరిగిన ప్రపంచకప్ తర్వాత మొదటి సిరీస్ ఆడబోతున్నాం. కాబట్టి మాపై అంచనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మునుపటి కంటే ఇప్పుడు జట్టు బాగా రాణిస్తుందనే విశ్వాసం నాకుంది' అని తెలిపింది. .