
హైదరాబాద్: బ్యాటింగ్ దిగ్గజం, భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుర్రాళ్ల కోసం మరోసారి అంబాసిడర్ కాబోతున్నారు. తన సుధీర్ఘ కెరీర్లో ఎన్నో సంస్థలు, కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరించిన ఆయన ఈ సారి కుర్రాళ్ల క్రికెట్కు అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. మార్చి నెలలో జరగనున్న టీ20 ముంబై లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు మాస్టర్ బ్లాస్టర్ నిర్ణయించుకున్నారు.
ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) సహకారంతో ప్రాబబిలిటీ స్పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న లీగ్ మార్చి 11 నుంచి 21 మధ్య జరగనుంది. ఆరు జట్లతో నిర్వహించే టోర్నీలో భాగస్వామ్యయ్యే ఫ్రాంఛైజీల కోసం బిడ్లను కూడా ఆహ్వానించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సచిన్ క్రేజ్ను లీగ్ ప్రచారం కోసం ఉపయోగించుకోవాలని నిర్వాహకులు భావించారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. ఎంసీఏతో అనుబంధం కలిగిఉండటం ఎప్పటికీ సంతోషమే. టీ20 ముంబై లీగ్ క్రికెట్ అభిమానులను అలరించేందుకు మాత్రమే కాదని యువ క్రికెటర్లు తమ సత్తాను చాటుకునేందుకు వచ్చిన గొప్ప అవకాశమని సచిన్ పేర్కొన్నాడు.
ప్రొబబిలిటీ సీఈవో మాట్లాడుతూ సచిన్ పాపులారిటీతో మాకు ఈ విధంగా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశాడు. అతని రాకతో తమ జట్టుకు కొత్త ఉత్సాహం వచ్చిందని అభిప్రాయపడ్డారు. లీగ్కు వేలం అనంతరం ఆరు జట్లు ఖరారైనాయి అని పేర్కొన్నారు. ముంబై నార్త్, ముంబై నార్త్-వెస్ట్, ముంబై నార్త్-ఈస్ట్, ముంబై నార్త్ సెంట్రల్, ముంబై సౌత్ సెంట్రల్, ముంబై సౌత్ జట్లు ఈ లీగ్లో తలపడనున్నాయి.