ముంబై: భారత్తో వన్డే సిరీస్లో భాగంగా జరిగిన నిర్ణయాత్మక ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్, ముఖ్యంగా కెప్టెన్ ఏబి డివిలియర్స్ ప్రదర్శనపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
'దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చాలా బాగుందని భావిస్తున్నా. డికాక్, డుప్లెసిస్ను తక్కువ చేయడం లేదుకానీ, డివిలియర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతని ఆట కొద్దిగా చూసినా అదంతా గుర్తుంది' అని పేర్కొన్నాడు.
'అప్పటికి డివిలియర్స్ ఇంకా ఆరు, ఏడో గేర్ మార్చలేదని షాన్ పొలాక్ చెబుతూనే ఉన్నాడు. అది నిజమే, ఏబీ ఇన్నింగ్స్ను నిర్మించిన తీరు బాగుంది. అతను బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం' అని సచిన్ చెప్పాడు.

ఇక డివిలియర్స్ తన కాలం కంటే ఎంతో ముందున్నాడని మాస్టర్ కొనియాడాడు. కెరీర్లో అత్యున్నత దశలో ఉన్న ఏబీ.. నమ్మశక్యం కాని విధంగా బ్యాటింగ్ చేస్తున్నాడని ప్రశంసించాడు.
ఇక వాంఖడే పిచ్పై చెలరేగిన వివాదంపై స్పందించిన సచిన్.. క్యూరేటర్ సుధీర్ నాయక్తో టీమిండియా డైరెక్టర్ రవిశాస్ర్తి ఏం మాట్లాడాడో తనకు తెలియదని చెప్పాడు. కాగా, ఐదో వన్డేలో 214 పరుగులతో తేడాతో ఓటమి పాలైన భారత్ వన్డే సిరీస్ను కోల్పోయిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా, అమెరికాలో వచ్చే నెలలో నిర్వహించనున్న క్రికెట్ ఆల్ స్టార్స్ సిరీస్-2015లో ఆడేందుకు సచిన్ టెండూల్కర్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. ఈ సిరీస్లో టెండూల్కర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ల నేతృత్వంలోని జట్లు తలపడనున్నాయి. న్యూయార్క్, హూస్టన్, లాస్ ఏంజెల్స్ల్లో ఈ మ్యాచులు జరగనున్నాయి.