భారతదేశ పర్యాటక రంగంపై విమర్శలు చేసిన మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్పై దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. 'అతిథి దేవో భవ' సంస్కృతి కలిగిన మన దేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయని సచిన్ అన్నాడు. మాల్దీవులు ప్రజలు 'ఇండియా ఔట్' అని పేర్కొనడంతో సచిన్ ట్వీట్ చేశాడు. అసలేం జరిగిందంటే..
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్లో పర్యటించిన విషయం తెలిసిందే. సముద్రంలో స్నార్కెలింగ్ చేశారు. సముద్రం తీరాన కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ''లక్షద్వీప్ సౌందర్యం, అక్కడి ప్రజల మమకారం చూసి సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయా. అక్కడి ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పర్యాటకులు లక్షద్వీప్ను కూడా వీక్షించండి'' అని మోడీ ట్వీట్ చేశారు.

దీంతో తమ పర్యాటర రంగానికి ప్రభావం చూపిస్తుందని భావించిన మాల్దీవులు ఎంపీ జహీద్ భారత్పై అక్కసు వెళ్లగక్కాడు. పర్యాటకంలో తమ దేశంతో భారత్ పోటీ పడలేదని నోరు జారాడు. మాల్దీవులు అందించే సర్వీస్, పరిశుభ్రత అందించలేరని, ఇండియా గదుల్లో దుర్వాసన వస్తుందని అతిగా వ్యాఖ్యలు చేశాడు. దీంతో మాల్దీవులను బహిష్కరించాలని, దేశంలోని ఐల్యాండ్స్లో పర్యటించాలని నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ కూడా ట్వీట్ చేశాడు. ''సింధు దుర్గ్లో నా 50వ పుట్టినరోజును జరుపుకొని దాదాపు 250కు పైగా రోజులు గడిచాయి. ఈ తీర ప్రాంతాలు మనకు కావాల్సినవన్నీ అందిస్తాయి. అద్భుతమైన ఆతిథ్యంతో అందమైన ప్రదేశాలతో నాకో జ్ఞాపకాల నిధిని అందించాయి. భారతదేశంలో గొప్ప తీర ప్రాంతాలు, సహజసిద్ధమైన దీవులు ఉన్నాయి. 'అతిథి దేవో భవ' సంస్కృతి కలిగిన మన దేశంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి'' అని సచిన్ ట్వీట్ చేశాడు.
మాల్దీవుల్లో గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా అనుకూలవాదిగా పేరున్న ముయిజు అధ్యక్ష పీఠమెక్కిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తమ దేశంలో మోహరించిన భారత బలగాలను ఉపసంహరించుకోవాలని మాల్దీవులు కోరింది. అలాగే ఇరు దేశాల ద్వైపాక్షిక బంధానికి బలమైన 'ఇండియాకు తొలిప్రాధాన్యం' విధానాన్ని కూడా మారుస్తామని ప్రకటించింది.