
ముంబై: మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) కట్టడికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇప్పటికే తన మంచి మనసును చాటుకున్నారు. ప్రమాదకర వైరస్పై పోరాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.50లక్షల విరాళమిచ్చిన సచిన్.. ఇటీవలే అన్నార్థులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు. నెలకు 5000 మంది అన్నార్థుల ఆకలిని సచిన్ తీర్చనున్నారు. తాజాగా సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో సంపాదించిన అనుభవాన్ని, జ్ఞానాన్ని 12 వేల మంది యువ వైద్యులతో పంచుకున్నారు.
సుదీర్ఘ క్రికెట్ కెరీర్లోని అనుభవాలను పంచుకోవడానికి సచిన్ ఎప్పుడూ ముందుంటారు. యువ క్రికెటర్లకు ఆటలో మెళకువలు చెబుతుంటారు. తాజాగా తను ఎదుర్కొన్న గాయాలు, వాటికి తీసుకున్న చికిత్స గురించి యువ ఆర్థోపెడిక్ డాక్టర్లకు వివరించారు. లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు 1200 మంది యువ వైద్యులకు డా.సుదీన్ వారియర్తో కలిసి సచిన్ ఆన్లైన్లో సెమినార్లో పాల్గొన్నారు.
క్రీడా గాయాల గురించి తన అనుభవాన్ని, వైద్యులు తనకి అందించిన చికిత్స గురించి 1200 మంది యువ వైద్యులకు సచిన్ సెమినార్లో వివరించారు. అతడు నిర్వహించిన సెషన్లో సాధారణ గాయాల బాధితులకు, క్రీడాకారుల గాయాల మధ్య ఉండే తేడాని వైద్యులు తెలుసుకున్నారు. సెమినార్లో టీమిండియా, ముంబయి ఇండియన్స్కు ఫిజియోథెరఫిస్టుగా పనిచేసిన డా.నితిన్ పటేల్ కూడా పాల్గొన్నారు.
సచిన్ తన కెరీర్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా.. మోచేతి గాయంతో తీవ్రంగా బాధ పడిన సంగతి తెలిసిందే. సచిన్ 2012లో వన్డే క్రికెట్ నుంచి తప్పుకున్నారు. 2013 అక్టోబరులో అంతర్జాతీయ టీ20 ఫార్మట్కు గుడ్బై చెప్పారు. ఇక కెరీర్లో 200వ టెస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత 2013 నవంబరులో అన్ని ఫార్మట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. తన కెరీర్లో 200 టెస్టులు, 463 వన్డే ఆడారు. టెస్టుల్లో 51 సెంచరీలు చేయగా..వన్డేల్లో 49 సెంచరీలు సాధించారు.