
ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా టెస్టు కెప్టెన్గా కోహ్లీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ సిరీస్ మరింత ఎంటర్టైనింగ్గా మారింది. ఈ క్రమంలోనే ఒక ట్విట్టర్ యూజర్ దీనికి సంబంధించిన పాత ఫొటో షేర్ చేశాడు. మొట్టమొదటి బీజీటీ సిరీస్ ట్రోఫీ ఎలా ఉందో ఆ ఫొటోలో ఉంది. సదరు ఫొటోలో ఆసీస్ మాజీ కెప్టెన్ అలన్ బోర్డర్, టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మధ్యలో ట్రోఫీతో సచిన్ టెండూల్కర్ నిలబడి ఉన్నాడు. అతని చేతిలో బీజీటీ ట్రోఫీ ఉంది.
ఈ ఫొటోపై సచిన్ టెండూల్కర్ స్పందించాడు. అది బీజీటీ (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) కాదన్నాడు. 'నాకు, గవాస్కర్ సర్కు మధ్య ఎలాంటి బోర్డర్ లేదు. కాబట్టి అది బీటీజీ' అని కామెంట్ చేశాడు. అంటే అది బోర్డర్, టెండూల్కర్, గవాస్కర్ అని చెప్పాడన్నమాట. ఈ కామెంట్ చూసిన నెటిజన్లు సచిన్ కామెడీ టైమింగ్కు నవ్వుకుంటున్నారు. కాగా, 1996-97లో జరిగిన మొదటి బీజీటీ సిరీసులో ఒకే ఒక టెస్టు మ్యాచ్ జరిగింది. సచిన్ కెప్టెన్సీలో ఆ మ్యాచ్ను భారత్ గెలిచి ట్రోఫీ సొంతం చేసుకుంది.
ఇప్పటి వరకు జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీల్లో ఓవరాల్గా చూసుకుంటే భారత్దే పైచేయిగా ఉంది. టీమిండియా ఈ ట్రోఫీని తొమ్మిది సార్లు గెలుచుకుంది. ఆస్ట్రేలియా కేవలం ఆరు సార్లే గెలిచింది. స్వదేశంలో జరిగిన చివరి నాలుగు బీజీటీ సిరీసులను టీమిండియానే గెలిచింది. అంతేకాదు, కోహ్లీ సారధ్యంలో ఆస్ట్రేలియాలో జరిగిన చివరి రెండు సిరీసులను కూడా నెగ్గింది. ఆసీస్ జట్టు చివరగా 2004-05లో ఈ ట్రోఫీ తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో ఎలాగైనా ఈసారి ట్రోఫీ నెగ్గాలని ఆస్ట్రేలియా గట్టి పట్టుదలగా ఉంది. మరి సిరీసులో ఏం జరుగుతుందో చూడాలి.