
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సోమవారం 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్మీడియాలో పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కాస్త వినూత్నంగా గంగూలీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
"హ్యాపీ బర్త్డే దాదీ.. అండర్-15 నుంచి మన ప్రయాణం ఇప్పుడు కామెంట్రీ వరకూ సాగుతుంది. ఇది చాలా అద్భుతమైన ప్రయాణం. ఈ ఏడాది నీకు చాలా మంచి జరగాలని కోరుకుంటున్నా" అంటూ సచిన్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సచిన్-గంగూలీ అండర్-15 ఫోటోని ట్వీట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు.
సచిన్ పోస్టు చేసిన ఫోటో ఎంతోగానో ఆకట్టుకుంటోంది. కాగా, 1972 జూలై 8న జన్మించిన గంగూలీ పూర్తి పేరు సౌరవ్ చండీదాస్ గంగూలీ. అభిమానులు ముద్దుగా పిలుకునే పేరు దాదా. 1992లో వెస్టిండీస్పై అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశాడు. తన దూకుడుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.
నవజ్యోత్ సింగ్ సిద్ధూ-అజారుద్దీన్ల మధ్య గొడవ గంగూలీకి టెస్టు మ్యాచ్ ఆడే అవకాశాన్ని కల్పించింది. 1996లో ఇంగ్లాండ్ టెస్టు సిరిస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో సౌరవ్ గంగూలీ ఎంపికయ్యాడు. అయితే, ఆ సిరిస్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ-అజారుద్దీన్ల గొడవ జరగడంతో... ఉన్నపళంగా సిద్దూ స్వదేశం తిరుగు పయనమయ్యాడు.
దీంతో అతడి స్థానంలో అరంగేట్రం చేసిన సౌరవ్ గంగూలీ... లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో సెంచరీ సాధించాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతం భారత్ క్రికెట్పై పెనుప్రభావం చూపింది. ఫిక్సింగ్ ఆరోపణలతో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఎవరూ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో దాదా ఆ కెప్టెన్సీ బాధ్యతలను తీసుకున్నాడు.
గంగూలీ నాయకత్వంలోనే భారత్ 2003 ప్రపంచకప్ ఫైనల్ చేరింది. ఈ టోర్నీలో గంగూలీ కెప్టెన్గానే కాకుండా ఆటగాడిగా 3 సెంచరీలతో 465 పరుగులు చేసి కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ నాట్వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో లార్డ్స్ బాల్కనీలో సౌరవ్ గంగూలీ చొక్కా విప్పిన సంఘటన అభిమానులకు ఇప్పటికీ గుర్తే. ఫైనల్లో యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ అద్భుత ప్రదర్శన చేయడంతో టీమిండియా నెగ్గింది.