ముంబై: జాన్ రైట్ అత్యుత్తమ కోచ్ అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ చెప్పారు. గ్రెగ్ చాపెల్ పైన తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. భారత్ క్రికెట్ ప్రతిష్టను దిగజార్చేందుకు గ్రెగ్ ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. జట్టులో ఇద్దరు మాత్రమే చాపెల్కు మద్దతుగా నిలిచారన్నారు.
సచిన్ టెండుల్కర్ ఆటో బయోగ్రఫీ.. ప్లేయింగ్ ఇట్ మై వేలో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. 1997లో శ్రీలంకతో జరిగిన సిరీస్ సమయంలో తనను సారథ్య బాధ్యతల అనూహ్యంగా తప్పించడం బాధించిందని సచిన్ పేర్కొన్నారు. అప్పుడు అది తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా తప్పించడం చికాకు కలిగించిందని, అవమానంగా భావించానని అభిప్రాయపడ్డారు.

సిరీస్ ముగింపు సమయంలో తనను హఠాత్తుగా తొలగించారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తనకు ఎవరు ముందుగా చెప్పలేదని, తాను మరెంతో కాలం సారథిగా ఉండలేనని మీడియా ద్వారా తెలిసిందని రాశారు. అప్పడు తాను తన స్నేహితులతో కలిసి సాహిత్య సదస్సులో ఉన్నానని పేర్కొన్నారు.
దానిని తాను చాలా అవమానంగా భావించానన్నారు. అది తనను అత్యుత్తమ క్రికెటర్గా మారేందుకు ఉపకరించిందని అభిప్రాయపడ్డారు. తనను నుండి సారథ్య బాధ్యతలు తీసుకోగలరు.. కానీ, తన ఆటను ఎవరూ తీసుకోలేరని తనకు తాను ఊరట చెందానని పేర్కొన్నారు.
తాను సారథిగా ఉన్న సమయంలో కొందరు ఆటగాళ్లు తనను స్కిప్ అనేవారని, ఆ తర్వాత ఢాకాలో స్కిప్పర్ అని ఓ ఆటగాడు పేర్కొన్నారని చెప్పారు. తాను తన బ్యాటింగ్ పైన దృష్టి సారించాలని భావించానని, జట్టు కోసం కొన్ని మ్యాచులు గెలిపించాలనుకున్నానని రాశారు.
తాను రెండో పర్యాయం భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న సమయంలో దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ కోచ్గా వ్యవహరించాడని పుస్తకంలో తెలిపాడు. 1999-2000 సీజన్లో జరిగిన ఆసీస్ పర్యటనలో కోచ్గా కపిల్ నుంచి ఎంతో ఆశించానని పేర్కొన్నాడు. అయితే, కపిల్ నిరాశపరిచాడన్నాడు. మ్యాచ్లో అనుసరించాల్సిన వ్యూహ రచనలో కపిల్ పాలుపంచుకునేవాడు కాదన్నాడు.. చర్చల్లో పాల్గొనేవాడు కాదన్నాడు.