హైదరాబాద్: క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి ఏడాది గడిచినప్పటికీ ఆయనకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచ కప్ టోర్నీకి సచిన్ టెండూల్కర్ హాజరవుతాడని, అతను తనకు హామీ ఇచ్చారని సచిన్ వీరాభిమాని సుధీర్ కుమార్ గౌతమ్ చెప్పారు.
భారత జట్టు ఎక్కడికెళ్లినా అక్కడ ప్రత్యక్షమయ్యే సుధీర్ కుమార్.. శ్రీలంకతో మూడో వన్డే ఆడేందుకు భారత జట్టు హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో ఆయన కూడా ఇక్కడి వచ్చారు. వారికి అభినందనలు తెలియజేశారు. కాగా, శుక్రవారం హైదరాబాద్ చేరుకున్న ఆటగాళ్లు, శనివారం రాజీవ్ గాంధీ స్టేడియంలో ప్రాక్టీస్ చేశారు.
'నేను సచిన్ టెండూల్కర్ను వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో జరిగే ప్రపంచ కప్ టోర్నీకి రావాలని కోరా. అందుకు సచిన్ అంగీకరించారు. అందుకే నేను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నా' అని 32ఏళ్ల సుధీర్ పిటిఐకి తెలిపారు.

'సచిన్ సార్ ఆడకుంటే ఏమవుతుంది. రిటైర్మెంట్ అయిన సచిన్ టెండూల్కర్ జట్టుతో ప్రత్యక్షంగా ఉంటే చాలు, జట్టు ప్రదర్శన మెరుగ్గా ఉంటుంది. నేను నా ఛాతీపై 'మిస్ యు టెండూల్కర్' అని పెయింటింగ్ వేసుకున్నా. శక్తి ఉన్నంత వరకు దాన్ని కొనసాగిస్తా' అని ముజఫర్నగర్కు చెందిన సుధీర్ చెప్పారు.
తన ఆరాధ్య దైవమైన సచిన్ టెండూల్కర్ ఆడే మ్యాచులను చూసేందుకు సుధీర్ తనకు లభించిన మూడు ప్రభుత్వ ఉద్యోగాలను కూడా వదిలేశాడు. అయితే ఎన్నో వ్యయాప్రయాసలకోర్చి అతను మ్యాచులకు వెళ్తూనే ఉన్నాడు. అతను ప్రస్తుతం రెండు రైళ్లలో ప్రయాణించి అహ్మదాబాద్ నుంచి శ్రీలంకతో జరిగే మూడో వన్డే కోసం హైదరాబాద్ వచ్చారు.
'నేను మ్యాచులు చూసేందుక ఇలా వెళుతూనే ఉంటాను. నాకు అలసట రాదు. నేను ఒక పుణ్య యాత్రలకు వెళుతున్నట్లు భావిస్తాను, ప్రస్తుతం నా లక్ష్యం వచ్చే ఏడాది జరగబోయే ప్రపంచ కప్ను ప్రత్యక్షంగా చూడటమే' అని అతడు పేర్కొన్నాడు.
సుధీర్ కుమార్ గౌతమ్ ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ ఆడిన 241 వన్డేలను, 42 టెస్టులను, 63 ఐపిఎల్, సిఎల్టీ20 మ్యాచులను, మూడు రంజీ మ్యాచులను ప్రత్యక్షంగా వీక్షించాడు. అతను 2002, నవంబర్ 6న జంషెడ్పూర్లో జరిగిన వెస్టిండీస్-ఇండియా మ్యాచుతో తన యాత్రను ప్రారంభించాడు సుధీర్.
తనను సచిన్ టెండూల్కర్ ఫ్యాన్ అంటే ఇష్టపడతానని సుధీర్ గౌతమ్ చెబుతాడు. నిరుడు ట్వంటీ20 ప్రపంచ కప్ సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ అతనికి రెండు నెలలపాటు అక్కడే ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసి అతన్ని గౌరవించింది.