ముంబై: టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత చరిత్రపై వచ్చిన 'ఎంఎస్ ధోనీ ది అన్టోల్డ్ స్టోరీ' విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు భారత క్రికెట్ దిగ్గజం, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్పై రూపొందుతున్న చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కాగా, సచిన్ టెండూల్కర్ ఈ చిత్ర విషయంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు.
సాధారణంగా తమ బయోపిక్ను చిత్రంగా మలిచేందుకు అనుమతించిన వారికి ఎంతో కొంత పారితోషికం ఇస్తుంటారు. ఇటీవల వచ్చిన 'ఎం.ఎస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ' చిత్రానికి ధోనీ సుమారు రూ.40కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

కానీ, సచిన్ టెండూల్కర్ మాత్రం తన జీవితంపై సినిమా తీసేందుకు అనుమతి ఇవ్వడమే కాకుండా, నటిస్తున్నందుకు పైసా పారితోషికం తీసుకోవట్లేదని తెలిసింది. తనదైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులను సొంతం చేసుకున్న సచిన్ టెండూల్కర్.. యువ క్రీడాకారులకు స్ఫూర్తిప్రదాత అని చెప్పుకోవడంలో అతిశయోక్తిలేదు.
కాగా, 'సచిన్- ఏ బిలియన్ డ్రీమ్స్' పేరుతో బాలీవుడ్లో సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్రాంతీయ భాషల్లోనూ అనువాదమయ్యే అవకాశం ఉంది. సచిన్ స్నేహితుడైన రవి భాగ్చంద్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో అతని వద్ద డబ్బులు తీసుకోవడం ఇష్టంలేని సచిన్.. పారితోషకాన్ని వద్దన్నాడట.
సినిమా షూటింగ్ సందర్భంగా భారత జట్టుతో అతనికి ఉన్న అనుబంధం.. అనుభవాలను సవివరంగా చెప్పాడట. కాగా, సచిన్ తన బయో చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తుండటం విశేషం.