ముంబై: కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముంబైలోని ఆస్పత్రి నుంచి ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. కానీ 47 ఏళ్ల సచిన్.. మరికొన్ని రోజులు హోం క్వారంటైన్లోనే ఉండనున్నారు. అయితే ఆయనకు ఇంకా నెగెటివ్ రాకపోయినా.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఇక ప్రమాదకర వైరస్ నుంచి తాను త్వరగా కోలుకోవడానికి చికిత్స చేసిన వైద్య సిబ్బందికి.. కోలుకోవాలని ఆకాంక్షించిన అభిమానులు, శ్రేయోభిలాషులకు సచిన్ ట్విటర్లో కృతజ్ఞతలు తెలిపారు.
గురువారం ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న సచిన్ టెండూల్కర్ ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. ముఖ్యంగా వైద్య సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 'ఆస్పత్రి నుంచి ఇప్పుడే ఇంటికొచ్చా. ఐసోలేషన్లో ఉండి విశ్రాంతి తీసుకుంటాను. నా కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు. ఆస్పత్రిలో నన్ను జాగ్రత్తగా చూసుకున్న వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఏడాది కాలంగా వారు ఇలాంటి కష్టసమయంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు' అని సచిన్ ట్వీట్ చేశారు.
తనకు కరోనా సోకిందని మార్చి 27న సచిన్ టెండూల్కర్ వెల్లడించిన విషయం తెలిసిందే. పాజిటివ్ రావడంతో మాస్టర్ ఐసోలేషన్కు వెళ్లిపోయారు. కానీ ముందు జాగ్రత్తగా కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం బాగుండడంతో ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆయనకు ఇంకా నెగెటివ్ రావాల్సి ఉంది. రోడ్సేఫ్టీ వరల్డ్ సిరీస్లో భాగంగా ఇండియా లెజెండ్స్కు సచిన్ నాయకత్వం వహించారు. ఈ మ్యాచులకు అభిమానులను స్టేడియాల్లోకి అనుమతించారు. క్రికెటర్లు నిబంధనలు పాటిస్తూ బయో బుడగలోనే ఉన్నా వైరస్ సోకింది. ముందుగా సచిన్కు పాజిటివ్ రావడం గమనార్హం.
— Sachin Tendulkar (@sachin_rt) April 8, 2021
1989 నుంచి 24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్.. అంతర్జాతీయ క్రికెట్లో 100 శతకాలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్మెన్గా రికార్డ్ నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో సచిన్ అగ్రస్థానంలో నిలిచారు. లిటిల్ మాస్టర్ తన కెరీర్ మొత్తంలో 34,357 పరుగులు బాదాడు. టెస్టుల్లో 15921, వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ చేశారు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్గా సచిన్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
Sunrisers Hyderabad: చెలరేగిన ప్రియం గార్గ్, సాహా.. మరోసారి చిత్తయిన బెయిర్స్టో సేన!