దుబాయ్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పైన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సచిన్ తన క్రికెట్ కెరీర్లో టాలెంటుకు పూర్తి న్యాయం చేయలేదని అభిప్రాయపడ్డారు. సచిన్ తన టాలెంటుతో మరిన్ని డబుల్ సెంచరీలు, ట్రిపుల్ లేదా 400 సెంచరీలు చేసే అవకాశం ఉన్నా చేయలేకపోయాడన్నారు.
సచిన్ పైన తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దన్నారు. సచిన్ తన అవకాశాలను మరింత బాగా వినియోగించుకొని ఉంటే క్రికెట్ చరిత్రలో సుదీర్ఘ కాలం నిలిచిపోయేవాడన్నారు. సచిన్కు సెంచరీలు చేయడం వరకు మాత్రమే తెలుసునని, వాటిని డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు ఎలా మలచాలన్నది తెలియదన్నారు.
ఒకవేళ సచిన్ తన టాలెంటును మరింత వినియోగిస్తే క్రికెట్ చరిత్రలో మరిన్ని కాలాల పాటు కీర్తిప్రతిష్టలు సొంతం చేసుకునేవాడన్నారు. వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్తో సరితూగే క్రికెటర్గా సచిన్ ఎదిగేవాడన్నారు. క్రికెట్ ప్రపంచంలో సచిన్ సరైన క్రికెటర్ అని కితాబిచ్చారు.

సాంకేతికంగా సచిన్లో చాలా పరిణితి ఉన్నా దానిని సక్రమంగా వినియోగించుకోలేదన్నారు. సచిన్ కేవలం సెంచరీలతోనే సరిపెట్టి అతని టాలెంటును పూర్తిగా బయటకు తీయలేదన్నారు.
సచిన్ తన టాలెంటు కంటే తక్కువగానే చేస్తున్నాడని తాను ఎప్పుడు అనుకుంటానని చెప్పారు. తాను సచిన్ టెండుల్కర్తో ఎక్కువగా కలిసి ఉంటే... 'నీవు నీలా ఎంజాయ్ చేస్తూ ఆడు.. వీరేంద్ర సెహ్వాగ్లా ఆడు' అని చెప్పేవాడినని అన్నారు. సచిన్ చాలా మంచి క్రికెటర్ అన్నారు.