న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం, పార్లమెంటుసభ్యుడు సచిన్ టెండూల్కర్ రాజ్యసభలో తొలిసారి గళం విప్పారు. ఎంపీగా ఎన్నికైన మూడేళ్ల తర్వాత మాస్టర్ బ్లాస్టర్ మొదటిసారి ప్రశ్నలు అడిగారు. గత శుక్రవారం రాజ్యసభలో ముంబై మెట్రో రైలుపై సచిన్ ప్రశ్న వేశారు.
2012 జూలై 3న రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన సచిన్ తొలిసారి తన సొంత నగరమైన ముంబైపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముంబై మెట్రో రైల్వేను ప్రత్యేక జోన్గా ఎందుకు ప్రకటించలేరని ఆయన రైల్వే శాఖను ప్రశ్నించారు.
కోల్కతా మెట్రోను ప్రత్యేక రైల్వే జోన్గా ప్రకటించిన తరహాలోనే ముంబైతో పాటు ఢిల్లీ, చెన్నై మెట్రోలను ఎందుకు ప్రత్యేక జోన్లుగా ప్రకటించలేరని సచిన్ తన లేఖలో ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన ప్రత్యేక రైల్వే జోన్ను ప్రకటిస్తారని సచిన్ అడిగారు.

మూడు నగరాల్లో ఉన్న మెట్రో ప్రమాణాలు వాటిని ప్రత్యేక జోన్లుగా గుర్తించే అవకాశం ఉందా లేదా అని ప్రశ్నించారు. కాగా, సచిన్ అడిగిన ప్రశ్నకు రైల్వే సహాయమంత్రి మనోజ సమాధానం ఇచ్చారు.
భారతీయ రైల్వేకు అనుసంధానమైన కోల్కతా మెట్రో సర్వీసులు భిన్నమైనవని మంత్రి తెలిపారు. మూడు మహా నగరాల్లో మెట్రో రైల్వే సర్వీసులు మెయిన్లైన్లతో అనుసంధానమై ఉంటాయని, కానీ కోల్కతాలో మాత్రం కేవలం మెట్రో సేవలే ఉంటాయని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు.
డ్రైవింగ్ లైసెన్సు అర్హత అంశంలో ఎందుకు మార్పులు చేశారన్న మరో ప్రశ్నను కూడా సచిన్ సంధించారు. ఆ ప్రశ్నపై సోమవారం రాజ్యసభలో సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. డ్రైవింగ్ లైసెన్సుపై సచిన్ టెండూల్కర్ ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ సమాధానం ఇవ్వనుంది. కాగా, రాష్ట్రపతి ద్వారా ఎంపికైన సచిన్ టెండూల్కర్.. గత కొంతకాలం పార్లమెంటుకు ఎక్కువగా హాజరుకాకపోవడంపై సచిన్ విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.