రియో డి జెనిరో: రియో ఒలింపిక్స్ 2016 కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అంగరంగా వైభవంగా వేడుకలు ప్రారంభం కానున్నాయి. రియో ఒలింపిక్స్లో పదివేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ వేడుకలను ప్రత్యక్షంగా లక్షలాది, పరోక్షంగా కోట్లాది మంది వీక్షించనున్నారు.
వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ఇప్పటికే ఒలింపిక్ విలేజ్కు చేరుకున్నారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులు వేడుకలకు హాజరవుతున్నారు.

ఒలింపిక్ అంబాసిడర్ సచిన్ టెండుల్కర్ కూడా రియోలో సందడి చేస్తున్నారు. ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్స్ డిన్నర్లో రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఒలింపిక్ సంఘం సభ్యురాలు నీతా అంబానీలతో కలిసి ఒలింపిక్ విలేజ్లో సందడి చేశారు. సచిన్ భారత క్రీడాకారులను ఉత్సాహపరుస్తారు.
కాగా, ఒలింపిక్స్లో బంగారు, వెండి పతకాలు గెలుచుకున్న భారత క్రీడాకారులకు ప్రోత్సాహకంగా భారత బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ ప్రత్యేక అవార్డులు అందచేస్తామని చెప్పింది. బంగారు పతక గ్రహీతలకు 500 గ్రాముల సావరిన్ గోల్డ్ బాండ్స్ని, రజత పతక విజేతలకు కిలో వెండిని ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్లు ఐబీజేఏ ఒక ప్రకటనలో తెలిపింది.