దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ తన జీవితంలోని ఉద్వేగభరితమైన సందర్భాల్ని గుర్తు చేసుకున్నాడు. తొలి సారి పాకిస్థాన్ టూర్ కు వెళ్లినప్పుడు ఏం జరిగింది?, తన తండ్రి మరణం తనలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది?, తాను ఎదుర్కొన్న ఇబ్బందికర సంఘటనలు ఏంటి? ఇలా చాలా విషయాలను గుర్తుచేసుకున్నాడు. అలానే యంగ్ క్రికెటర్లకు విలువైన సూచనలు కూడా ఇచ్చాడు. బీసీసీఐ.. సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారంతో తనను సన్మానించగా.. ఈ విషయాల్ని పేర్కొన్నాడు.
అది.. అతి పెద్ద నిర్ణయం
90ల్లో రెండేళ్ల పాటు ఎటువంటి బ్యాట్ కాంట్రాక్ట్లు లేకుండానే తాను క్రికెట్ ఆడినట్లు గుర్తు చేసుకున్నాడు సచిన్. ఆ సమయంలో కంపెనీలు ఎక్కువగా మద్యపానం, పొగాకు ప్రమోట్ చేసేవని... కానీ వాటికి తాను విరుద్ధమని చెప్పాడు. ఆ సమయంలో అది చాలా పెద్ద నిర్ణయమని వెల్లడించాడు. 1999లో ఆరోగ్య పరంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తన వెన్నుముకకు తీవ్రగాయమైందని, అది చాలా ఇబ్బంది పెట్టిందని అన్నాడు.

9 అయిందా? లేదా దాటిందా?
తొలిసారి పాకిస్థాన్ పర్యటన వెళ్లినప్పుడు.. ఆ టూర్ తనకు ఎన్నో విషయాలను నేర్పిందని అన్నాడు సచిన్. "1989లో నా 16 ఏళ్ల వయసులో మొదటిసారి పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినప్పుడు.. అక్కడ ప్రాక్టీస్ కోసం మా బస్సు ఉదయం 9 గంటలకు బయలుదేరేది. కానీ ఒక రోజు కొన్ని నిమిషాల పాటు ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది.
అప్పుడు బస్సులో ఉన్న కపిల్ దేవ్ ఇప్పుడు 9 అయిందా లేదా 9 గంటలు దాటిందా? అని ప్రశ్నించారు. దీంతో అప్పటి నుంచి నా వాచ్ లో టైమ్ ను ఏడెనిమిది నిమిషాలు ముందు పెట్టుకున్నాను. ఆ పాకిస్థాన్ పర్యటన నాకెంతో నేర్పింది." అని చెప్పుకొచ్చాడు.
ఆ సంఘటన నా జీవితాన్ని మార్చేసింది
"1999లో వరల్డ్ కప్ సమయంలో మా నాన్న చనిపోతే.. అంత్యక్రియల కోసం ఇంటికి వచ్చాను. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఇంటి దగ్గరే ఉండి.. మళ్లీ టీమ్ తో కలిశాను. అయితే అప్పుడు ఒక్కరోజులోనే నా జీవితంలో పెద్ద మార్పు చోటు చేసుకుంది. నా జీవితం పూర్తిగా మారిపోయింది. అప్పుడే నా లైఫ్ లో జరిగే ప్రతీది మా నాన్నకు చూపించాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఏది సాధించిన ముందుగా బ్యాట్ ఎత్తి మా నాన్నకు చూపిస్తాను." అని పేర్కొన్నాడు.
ఇంకా యంగ్ క్రికెటర్లకు ఎంతో భవిష్యత్ ఉందని, అందుకే బ్యాట్ తో పాటు బంతిపై నియంత్రణ కోల్పోవద్దని సూచించాడు సచిన్. వీలైనంత వరకు ఉత్తమ ప్రదర్శన చేయాలని సలహా ఇచ్చాడు.