న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన ఆటోబయోగ్రపీ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో కపిల్ దేవ్ కోచ్గా ఉన్నప్పుడు తనను నిరాశపరిచాడని విషయం పేర్కొన్న విషయం తెలిసిందే. దీని పైన కపిల్ దేవ్ స్పందించేందుకు నిరాకరించారు. అయితే, తన అభిప్రాయం చెప్పారు.
అది సచిన్ అభిప్రాయమని, ప్రతి ఒక్కరు కూడా తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు కలిగి ఉంటారని అన్నారు. తాను ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవిస్తానని చెప్పారు. బాగా ఆడిన వారిని తాను ప్రశంసిస్తానని చెప్పారు. గెలుపోటములు అనేది ఇక్కడ విషయం కాదన్నారు.
జట్టు శిక్షకుడిగా తనపై సచిన్ వెల్లడించిన అభిప్రాయాన్ని గౌరవిస్తున్నానని అభిప్రాయపడ్డారు. కొంతకాలం నుంచి తనకున్న అభిప్రాయం అదేనని, ఈ విషయంలో చెప్పడానికి ఏమీ లేదన్నారు. కపిల్ దేవ్ 1999 సెప్టెంబర్ నుంచి 2000 సెప్టెంబర్ వరకు కపిల్ ఇండియా జట్టుకు కోచ్గా వ్యవహరించాడు.

తాను రెండో పర్యాయం భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న సమయంలో దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ కోచ్గా వ్యవహరించాడని పుస్తకంలో సచిన్ పేర్కొన్న విషయం తెలిసిందే. 1999-2000 సీజన్లో జరిగిన ఆసీస్ పర్యటనలో కోచ్గా కపిల్ నుంచి ఎంతో ఆశించానని పేర్కొన్నాడు. అయితే, కపిల్ నిరాశపరిచాడన్నాడు. మ్యాచ్లో అనుసరించాల్సిన వ్యూహ రచనలో కపిల్ పాలుపంచుకునేవాడు కాదన్నాడు.. చర్చల్లో పాల్గొనేవాడు కాదన్నాడు.
ఇదిలా ఉండగా.. ఓ ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ ప్రధాని నరేంద్ర మోడీ పైన ప్రశంసలు కురిపించారు. ఆస్ట్రేలియా పర్యటకు కపిల్, సునీల్ గవాస్కర్ను మోడీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కపిల్ ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మోడీ గుజరాత్ను బాగా అభివృద్ధి చేశారని, భారత్ను కూడా అలాగే చేస్తారని విశ్వసిస్తున్నామన్నారు. మోడీది ఓపెన్ మైండ్ అన్నారు. ప్రతి ఒక్కరిని వినేందుకు ఆయన ప్రయత్నలు చేస్తున్నారన్నారు.
కాగా, తాను కూడా మనిషినేనని, క్రికెట్ దేవుణ్ణి కాదని సచిన్ అన్న విషయం తెలిసిందే. మంగళవారం ఓ ఇంటర్వ్యూలో తాను సామాన్య వ్యక్తిని అని చెప్పారు. తాను సాధారణమైన వ్యక్తినని, మైదానంలో ఎన్నో తప్పులు చేశానన్నారు.
ప్రజలు తనపై ఇంతలా అభిమానం చూపడాన్ని అదృష్టంగా భావిస్తానని, దేవుడు తనపై కరుణ చూపాడన్నారు. రిటైర్మెంట్ తర్వాత బిజీ అయ్యానని, జీవితంలోని మరో పార్శ్వం గురించి తెలుసుకుంటున్నానన్నారు. జనాలు తనను ఎంతో ఇష్టపడటం తన అదృష్టమన్నారు.