ఇస్లామాబాద్: భారత్ గెలిచిన ప్రపంచ కప్ లేకపోతే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్కు పరిపూర్ణత వచ్చేది కాదని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ అభిప్రాయపడ్డారు. వన్డే ప్రపంచ కప్ మరో వంద రోజుల దూరంలో ఉన్న నేపథ్యంలో వసీం ఐసీసీకి ఓ కాలమ్ రాశాడు.
అందులో ప్రపంచ క్రికెట్లోని పలు అంశాలను తన వ్యాసంలో స్పృశించాడు. భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పైనా తన అభిప్రాయాలు వెలిబుచ్చాడు. భారత్ 2011 ప్రపంచ కప్ నెగ్గడంతో సచిన్ టెండుల్కర్ కెరీర్ పరిపూర్ణమైందని ఆయన అభిప్రాయపడ్డాడు.
ప్రపంచ కప్ లేకుంటే సచిన్ కెరీర్ అసంపూర్ణంగానే మిగిలిపోయి ఉండేదన్నాడు. ఏ క్రికెటర్కైనా ప్రపంచ కప్ విజయంతోనే కెరీర్ సాఫల్యత దక్కుతుందన్నదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నాడు. కెరీర్ ఖాతాలో వరల్డ్ కప్ విజయం లేకపోతే ఎలా ఉంటుందో లారా, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, జాక్వెస్ కలిస్ వంటి మేటి క్రికెటర్లను అడిగితే చెబుతారన్నాడు.

కాగా, వసీం అక్రమ్ 1992లో ప్రపంచ కప్ నెగ్గిన పాకిస్తాన్ జట్టులో సభ్యుడు. 1999లో అతని నాయకత్వంలో పాకిస్తాన్ జట్టు రన్నరప్గా నిలిచింది. అంతేగాదు, 1987, 1996లో వరల్డ్ కప్ సెమీస్ చేరిన పాకిస్తాన్ జట్టులోనూ అతను ఉన్నాడు.
ఇదిలా ఉండగా... సచిన్ టెండుల్కర్ ఆటో బయోగ్రఫీ గురువారం విడుదల కానున్న విషయం తెలిసిందే. తన ఆటో బయోగ్రఫీలో భారత్ మాజీ కోచ్ గ్రెగ్ చాపల్ గురించి సచిన్ చెప్పిన విషయాలు ఇప్పుడు చర్చకు దారి తీశాయి.
గ్రెగ్ చాపల్ పైన సౌరవ్ గంగూలీ, హర్భజన్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు ఇప్పటికే స్పందించారు. మాజీలైన సీనియర్లు కూడా ధీటుగా గ్రెగ్ పైన మండిపడ్డారు. అయితే, రాహుల్ ద్రావిడ్ మాత్రం దీని పైన మాట్లాడేందుకు నిరాకరించారు. పుస్తకం చదవకుండా తాను మాట్లాడలేనని చెప్పారు.