
మైదానంలో ఎక్కువ మాట్లాడేవాడిని..
వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ వంటి సీనియర్లు అప్పుడు జట్టులో ఉన్నారు. అయితే వీళ్లందర్నీ కాదని ధోనీకి పగ్గాలు అప్పగించాలని సచిన్ సూచించాడు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సచిన్ వెల్లడించాడు. 'ఇంగ్లండ్లో ఉండగా నాకు కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చారు. అప్పుడే జట్టులో జూనియర్లలో ఒక మంచి లీడర్ ఉన్నాడని చెప్పా. అతన్ని జాగ్రత్తగా గమనించాలని, భవిష్యత్తులో మంచి సారధి అయ్యే సత్తా అతనికి ఉందని సూచించా. ఎందుకంటే నేను ధోనీతో చాలా మాట్లాడేవాడిని. స్లిప్స్లో ఉండగా కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ అయినా కూడా ధోనీతోనే ఎక్కువ మాట్లాడేవాడిని. అతను చాలా ప్రశాంతంగా మంచి పాయింట్స్ చెప్పేవాడు' అని సచిన్ గుర్తుచేసుకున్నాడు.

ఆ లక్షణాలన్నీ ధోనీలో ఉన్నాయి..
తను ఎలాంటి ప్రశ్న అడిగినా ధోనీ చాలా కామ్గా పరిస్థితిని అనలైజ్ చేసేవాడని సచిన్ చెప్పడు. అదే సమయంలో చాలా బ్యాలెన్స్డ్గా, మెచ్యూరిటీతో వివరణలు ఇచ్చేవాడన్నాడు. 'మంచి కెప్టెన్సీ అంటే ప్రత్యర్థి కన్నా ఒక అడుగు ముందే ఆలోచించడం. అలా ఎవరైనా చేయగలిగితే అతను బెస్ట్ కెప్టెన్ అవుతాడు. అందుకే జోష్ సే నహీ, హోష్ సే ఖేలో (జోష్తో కాదు, తెలివిగా ఆడాలి) అని క్రికెట్లో అంటుంటాం. పది బంతుల్లో పది వికెట్లు తీయడం కుదరదు. దాని కోసం చాలా ప్లాన్ చేయాలి. రోజు చివరకు స్కోర్బోర్డులో ఏముందనేది ముఖ్యం. ఆ లక్షణాలన్నీ ధోనీలో కనిపించాయి. అందుకే అతని పేరు సూచించా' అని సచిన్ వివరించాడు.

కెప్టెన్ కూల్ ధోనీ..
సచిన్ చెప్పినట్లే టీమిండియాను కొత్త శిఖరాలకు ఎక్కించిన ధోనీ.. టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ మూడు ఐసీసీ టోర్నీలో నెగ్గిన ఏకైక కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. ధోనీ నాయకత్వంలో వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సచిన్ కూడా ఉన్నాడు. ఇలా వరల్డ్ కప్ ముద్దాడాలన్న సచిన్ కల నెరవేర్చిన కెప్టెన్గా ధోనీని అభిమానులు పొగడటం తెలిసిందే. సచిన్ 2013లో తన చివరి టెస్టు మ్యాచ్ కూడా ధోనీ నాయకత్వంలోనే ఆడాడు. నరాలు తెగే ఉత్కంఠభరిత పరిస్థితిలో కూడా చాలా ప్రశాంతంగా ఉంటూ జట్టును గెలిపించడం ధోనీ స్టైల్. అందుకే అతన్ని అందరూ కెప్టెన్ కూల్ అని పిలుస్తుంటారు.


Click it and Unblock the Notifications