

హైదరాబాద్: కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ ప్రారంభించిన ఫిట్నెస్ చాలెంజ్ దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. రాజకీయ నాయకులతో పాటు సినీతారలు కూడా ఈ ఫిట్నెస్ చాలెంజ్ను స్వీకరించి తమ వర్క్ ఔట్కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా, తెలంగాణ రాజకీయ నేతలు పర్యావరణానికి సంబంధించిన మరో ఆసక్తికర ఛాలెంజ్ను ప్రారంభించారు. ఈ ఛాలెంజ్ పేరు హరితహారం. ఇందులో భాగంగా తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) విసిరిన ఛాలెంజ్ను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్వీకరించారు.
కేటీఆర్ విసిరిన హరితహారం చాలెంజ్ స్వీకరించిన సచిన్ తన ఇంటి ఆవరణలో కొన్ని మొక్కలు నాటారు. అనంతరం వాటికి మొక్కలకు నీళ్లు పోశారు. తనను ఇలాంటి చాలెంజ్కు ఆహ్వానించినందుకు కేటీఆర్కు సచిన్ కృతజ్ఞతలు తెలిపారు. భూమిని పచ్చనిచెట్లతో ఉండేలా చేయడం మన చేతుల్లోను ఉందని సచిన్ ట్వీట్ చేశారు.
సచిన్ ట్వీట్పై కేటీఆర్ స్పందిస్తూ "థ్యాంక్యూ మాస్టర్.. మీరు కూడా మరో ఐదుగురిని హరితహారం చాలెంజ్కు నామినేట్ చేయండి" అని సచిన్కు సూచించారు.
మరోవైపు టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా కేటీఆర్ విసిరిన హరితహారం చాలెంజ్ను స్వీకరించారు. గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టమని పేర్కొంటూ మొక్కలు నాటుతున్న ఫొటోలను పోస్ట్ చేశారు. "కేటీఆర్ చాలా గొప్ప చాలెంజ్ను మొదలుపెట్టారు. నేను కూడా వీరేంద్ర సెహ్వాగ్, మిథాలీరాజ్, పీవీ సింధులను హరితహారం చాలెంజ్కు ఆహ్వానించారు. మూడు మొక్కలు నాటాలి" తన ట్వీట్లో లక్ష్మణ్ చాలెంజ్ చేశారు. అనంతరం లక్ష్మణ్కు ధన్యవాదాలు తెలుపుతూ కేటీఆర్ రీట్వీట్ చేశారు.