న్యూఢిల్లీ: పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రహానెతో పాటు రెజ్లర్ సుశీల్ కుమార్ పాలుపంచుకున్నారు.
ముంబైలోని ఎమ్సీఏ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి సచిన్, రోహిత్, రహానెతో పాటు కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా హాజరయ్యారు. ఇక ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కోహ్లీ, సుశీల్ పాల్గొన్నారు.
మొక్కలు నాటి పర్యావరణహితానికి పాటుపడాలని యువతకు టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్తో కలిసి దిల్లీలోని ఇందిరా పర్యావరణ భవనంలో వాళ్లు మొక్కలు నాటారు.

'పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ముఖ్యంగా యువత ఈ దిశగా ముందడుగు వేయాలి' అని కోహ్లి చెప్పాడు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడడానికి యువత ముందుకు రావాలని కోహ్లీ సూచించాడు. పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కోహ్లీ చెప్పాడు.
'ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తాం. రోజుకు ఒక మొక్కైనా నాటతామని మనందరం ప్రతిజ్ఞ చేయాల'ని సుశీల్ తెలిపాడు. 'విరాట్, సుశీల్ మొక్కలు నాటి అందరికీ సందేశాన్నిచ్చారు. ముంబయిలో సచిన్, అజింక్య రహానె.. బరోడాలో యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఈ కార్యక్రమం చేపట్టారు. వాళ్ల బాటలోనే మనమూ పయనిద్దాం' అని జవదేకర్ అన్నారు.