న్యూఢిల్లీ: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటున్నారు. అంతేగాక, ప్రతీ ముఖ్యమైన విషయంలో స్పందిస్తూ స్ఫూర్తిదాయకమైన ట్వీట్లతో ఆకట్టుకుంటున్నాడు. అప్పడప్పుడు తనదైన శైలిలో దూకుడును కూడా ట్వీట్లలో ప్రదర్శిస్తున్నాడు.

తాజాగా, క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్తర్ సచిన్ టెండూల్కర్పైనే ఓ సరదా ట్వీట్ చేశాడు సెహ్వాగ్. దీనికి సచిన్ కూడా అంతే సరదాగా స్పందించాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ట్వీట్ల సంభాషణ అందర్నీ ఆకట్టుకుంటోంది.
కాగా, ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించి నెంబర్వన్ ర్యాంక్కు ఎగబాకిన టీమ్ఇండియాను అభినందిస్తూ సచిన్ ఓ ట్వీట్ చేశాడు. దానికి వీరూ స్పందిస్తూ.. 'ఓ దేవుడు గారూ.. కొంచెం వ్యాఖ్యాతల్ని కూడా ప్రోత్సహించండి. మాలోనూ స్ఫూర్తి కలుగుతుంది' అంటూ సరదాగా రీట్వీట్ చేశాడు.
దీనికి బదులుగా 'జియో మేరే లాలా.. తథాస్తు' అని సరదాగా స్పందించాడు సచిన్. కాగా, న్యూజిలాండ్ సిరీస్కు వీరూ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.