న్యూఢిల్లీ: మాస్టర్ బ్యాట్స్ మన్ సచిన్ టెండూల్కర్ వల్లనే మహేంద్ర సింగ్ ధోనీ భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ అయ్యాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి శరద్ పవార్ చెప్పారు. కెప్టెన్సీకి ధోనీ పేరును ప్రతిపాదించింది టెండూల్కరేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీని వదులుకుంటానని చెప్పినప్పుడు భారత జట్టు ఇంగ్లాండులో ఎంతటి సంక్షోభానికి గురైందో ఆయన వివరించారు.
రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ వద్దని చెప్పినప్పుడు కొందరు సెలెక్టర్లు సచిన్ ను కెప్టెన్సీ చేపట్టాలని అడిగారని, అయితే తనకు వద్దని చెప్పాడని, అయితే ఎవరైతే బాగుంటుందో చెప్పాలని తాను అడిగానని, ధోనీ లాంటి వాళ్లకు ఇవ్వాలని సూచించాడని శరద్ పవార్ వివరించారు. జట్టు సభ్యులతో ధోనీకి మంచి సంబంధాలున్నాయని, ధోనికీ కెప్టెన్సీ అప్పగించాలని టెండూల్కర్ చెప్పాడని, అయితే తాను ఎంపికలో జోక్యం చేసుకోబోనని, సచిన్ సూచనను మాత్రం సెలెక్టర్ల చెవిన వేస్తానని చెప్పానని ఆయన అన్నారు.
ట్వంటీ 20 మ్యాచుల్లో యువకులకు అవకాశం కల్పించడానికి దోహదం చేశారని ఆయన టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లేలను ప్రశంసించారు. ఇంగ్లాండులో భారత జట్టు పర్యటిస్తున్నప్పుడు తనను సచిన్ కలిశాడని, మీరు జట్టు ఎంపికలో జోక్యం చేసుకోరనే విషయం తెలుసు, కానీ నా తరంవాళ్లని ట్వంటీ 20 మ్యాచుకు ఎంపిక చేయవద్దని మాత్రం సెలెక్టర్లకు చెప్పండి అని సచిన్ తనతో చెప్పారని ఆయన అన్నారు. కెప్టెన్ గా ధోనీ అద్భుతంగా రాణిస్తున్నాడని ఆయన ప్రశంసించారు. టెస్టు జట్టు కెప్టెన్ గా అనిల్ కుంబ్లే ప్రశంసనీయమైన పాత్ర నిర్వహించాడని, జాతి వివక్ష వివాదం చెలరేగినప్పుడు కుంబ్లే ఎంత పరిణతిని ప్రదర్శించాడని ఆయన అన్నారు. కుంబ్లే భారత రాయబారిలా పనిచేశాడని, వివాదం విషయంలో కుంబ్లే వ్యవహారశైలి గర్వకారణంగా ఉందని ఆయన అన్నారు.