ముంబై: శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో 173 బంతుల్లో 264 పరుగులు చేసిన రోహిత్ శర్మ పైన రాజ్యసభ సభ్యుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ శుక్రవారం ప్రశంసల వర్షం కురిపించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ను అందుకున్న శర్మను ఈ లెజెండరీ అభినందించాడు.
రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించినందుకు ఆనందిస్తున్నానని చెప్పాడు. ఒకే వ్యక్తి రెండుసార్లు ఈ ఫీట్ను సాధించటం చాలా ప్రత్యేకమన్నాడు. వరల్డ్ కప్ పోటీలకు ఆస్ట్రేలియా వెళ్లేముందు ఈ ఇన్నింగ్స్ సరైన ప్రాక్టీసు వంటిదని చెప్పాడు. రోహిత్ రికార్డు పట్ల చాలా సంతోషిస్తున్నానని చెప్పాడు. అయితే, తాను రోహిత్ శర్మ ఇన్నింగ్స్ చూడలేకపోయానని చెప్పాడు.
కాగా, రోహిత్ శర్మ 173 బంతులు ఎదుర్కొని 264 పరుగులు చేసిన విషయం తెలిసిందే. తద్వారా రోహిత్ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టారు. రెండు డబుల్ సెంచరీలు చేసిన బ్యాట్స్మన్గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డ్ సృష్టించారు. అలాగే అత్యధిక ఫోర్లు, సిక్స్లతో ఎక్కువ పరుగులు చేసిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు.

ఇదిలా ఉండగా.. రోహిత్ శర్మ లిస్ట్ ఏ క్రికెట్లోను అత్యధిక పరుగులు చేశాడు. జూన్ 19, 2002లో రోహిత్ శర్మ 264పరుగులు చేశాడు. ప్రపంచంలో రోహిత్ కంటే ముందు అలీ బ్రోన్ (268) ముందున్నాడు.
రోహిత్ శర్మ సంచలన ఇన్నింగ్స్తో దుమ్ము రేపడంతో శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. రోహిత్ (173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264) ప్రపంచ రికార్డు డబుల్ సెంచరీ సాధించడంతో నాలుగో వన్డేలో కోహ్లీ సేన 153 పరుగుల తేడాతో లంకను మట్టి కరపించింది.
దీంతో సిరీస్లో భారత్ 4-0 ఆధిక్యంలో నిలిచింది. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈడెన్ వేదికగా గురువారం జరిగిన ఈ మ్యాచ్లో.. రోహిత్ ద్విశతకంతో పాటు కోహ్లీ (64 బంతుల్లో 6 ఫోర్లు 66) అర్ధ సెంచరీతో మెరవడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 404 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 43.1 ఓవర్లలో 251 రన్స్కే ఆలౌటైంది.