
న్యూఢిల్లీ: క్రికెట్ను మినహాయించి టీమిండియా విరాట్ కోహ్లీకి అభిమానులు కోకొల్లలు. అతని ఆట తీరుకే కాదు. సామాజిక సేవకు సైతం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఇటీవలే విరాట్ కోహ్లీకి తాను పెద్ద అభిమానినంటూ ఆస్ట్రేలియా ఫుట్బాల్ లెజెండ్ టిమ్ కాహిల్ చెప్పాడు. 'క్రికెట్ అంటే నాకెంతో ఇష్టం. నా ఆల్టైమ్ ఫేవరెట్ సచిన్. కానీ క్రికెట్లో కోహ్లీ ఈ స్థాయికి చేరుకోవడానికి అతడు శ్రమించిన తీరు..నన్ను విరాట్ అభిమానిగా మారేలా చేసింది' అని పేర్కొన్నాడు.
రాబోయే ఇండియన్ సూపర్ లీగ్లో 38 ఏళ్ల కాహిల్ జంషెడ్పూర్ ఎఫ్సీకి ప్రాతినిధ్యం వహించనున్నాడు. 'కోహ్లీ బాగా కష్టపడతాడు. అణకువగా ఉంటాడు. క్రికెట్ కోసం అతడు ఎంతో త్యాగం చేశాడు. తనను అభిమానించే దేశ ప్రజలను తన ఆటతో అలరిస్తున్నాడు. తన సంపాదనలో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుండడం కోహ్లీపై అభిమానం పెంచింది' అని కాహిల్ వివరించాడు.
ఇండియన్ సూపర్ లీగ్ కంటే ముందుగా అట్లెటికో మాడ్రిడ్కు ప్రాతినిథ్యం వహించిన టిమ్ కాహిల్ పట్ల ఆ జట్టు యాజమాన్యం విశేషంగా స్పందించింది. ఈ క్రమంలో అతనిపై ప్రశంసలు గుప్పిస్తూ.. 'అతనో మంచి స్ట్రైకర్. పిచ్లోనూ బయటా అద్భుతమైన ప్రదర్శన ఇవ్వగల ఆటగాడంటూ కితాబిచ్చింది.' అని పేర్కొంది.
'వాళ్లు అలా మాట్లాడారంటే వాళ్లకు నా గురించి బాగా తెలిసే ఉంటుంది. లీగ్లో నా ఆటతీరును చూసి మాట్లాడుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. అంతేకాదు, లీగ్ ముగిశాక కూడా నా ఆట గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఇండియన్ ఫుట్బాల్కి నా వంతు సహాయం చేసేందుకు సిద్ధమవుతున్నాను' అని ముగించాడు. గతంలో మ్యాచ్ జరిగినప్పుడు క్రమశిక్షణా నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ అతనిపై మూడు మ్యాచ్ల నిషేదం విధించబడింది.