
ముంబై: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో సెమీఫైనల్ నుంచి పరిమిత స్థాయిలో అంపైర్ నిర్ణయ సమీక్ష (డీఆర్ఎస్) విధానాన్ని అమలు చేయనున్నట్లు బీసీసీఐ జనరల్ మేనేజర్ సబా కరీం సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత సీజన్ నాకౌట్ మ్యాచ్లలో చోటుచేసుకున్న అంపైరింగ్ తప్పిదాల కారణంగా.. డీఆర్ఎస్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. అయితే సెమీస్ దశ నుంచి మాత్రమే డీఆర్ఎస్ను వినియోగించనున్నారట. స్నికోమీటర్, బాల్ ట్రాకింగ్ లేకుండా పాక్షికంగా డీఆర్ఎస్ను వినియోగించనున్నారని సమాచారం తెలుస్తోంది.
భారత మాజీ వికెట్ కీపర్ సబా కరీం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'రంజీ ట్రోఫీలో సెమీ ఫైనల్స్ నుంచి డీఆర్ఎస్ను అమలు చేయనున్నాం. క్వార్టర్ ఫైనల్స్లో మాత్రం వినియోగించట్లేదు. రంజీల్లో సమీక్షలను నిర్వహించడం ఇదే తొలిసారి. అయితే.. మాకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ వినియోగిస్తాం' అని అన్నారు.
'రంజీ ట్రోఫీలో పరిమితస్థాయి డీఆర్ఎస్ మాత్రమే ఉంటుంది. స్నికోమీటర్, బాల్ ట్రాకింగ్ ఉండదు. రెడ్ జోన్, స్పిన్ విజన్ ఉంటాయి. వీటితో అంపైర్లు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారు' అని సబా కరీం తెలిపారు. గతంలో రంజీ ట్రోఫీలో నాకౌట్ మ్యాచ్లలో కూడా డీఆర్ఎస్ ఉంటుందని సబా కరీం ప్రకటించిన సంగతి తెలిసిందే.
సుప్రీం కోర్టు నియమించిన పరిపాలకుల కమిటీ (సీఓఏ) పరిమితమైన డీఆర్ఎస్ను ఉపయోగించడానికి గత ఏడాది జూన్ నెలలోనే అనుమతి ఇచ్చింది. గత రంజీ ట్రోఫీలో కర్ణాటక, సౌరాష్ట్ర జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్లో భారత టెస్ట్ ప్లేయర్ ఛెతేశ్వర్ పుజారా ఔటైనా.. అంపైర్లు నాటౌట్గా ప్రకటించారు. దీంతో అంపైర్లపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దేశవాళీ క్రికెట్లో కూడా డీఆర్ఎస్ను అమలు చేయాలని అభిమానులు, మాజీ క్రికెటర్లు కోరారు.
గత అక్టోబర్ నెలలో మిథాలీ రాజ్ సారథ్యంలోని వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులు డైలీ అలెవన్స్ (డీఏ) లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో భారత క్రికెట్ ఆపరేషన్స్ జీఎంగా, మహిళల క్రికెట్ జట్టుకు ఇన్ఛార్జిగా ఉన్న కరీం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో ఇలాగేనా చేసేది అని ఓ బీసీసీఐ సీనియర్ అధికారి మండిపడ్డారు.