
ముంబై: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021కు సమయం దగ్గరపడుతోంది. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ యూఏఈ, ఒమన్ వేదికగా మెగా టోర్నీ జరగనుంది. భారత్లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో టోర్నీ యూఏఈకి తరలిపొయిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ కోసం ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించగా.. టోర్నీ విజేత గురించి అప్పుడే చర్చ మొదలైంది. తమ ఫేవరెట్ జట్ల బలాబలాలు, గెలిచేందుకు వారికి గల అర్హతల గురించి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డిబేట్లు పెడుతున్నారు. మరోవైపు మాజీలు సెమీస్ చేరే జట్లు, కప్ కొట్టే టీం ఏదో జోస్యం చెపుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఇటీవలే సెమిస్ చేరే జట్లను ప్రకటించాడు. తాజాగా ఈ జాబితాలో భారత జట్టు మాజీ వికెట్ కీపర్ సబా కరీం సైతం చేరాడు.
డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్కు అగ్రతాంబూలం వేసిన సబా కరీం.. ఇంగ్లండ్, భారత జట్లకు కూడా టీ20 ప్రపంచకప్ 2021 సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇక నాలుగో స్థానం కోసం దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య పోటాపోటీ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. స్పోర్ట్స్ తక్తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆస్ట్రేలియా సెమీస్ చేరదని సబా కరీం పేర్కొన్నాడు. గత టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన విండీస్.. కీరన్ పొలార్డ్ సారథ్యంలోని ప్రస్తుత జట్టు కూడా ఆ ఫలితాన్ని పునరావృతం చేసే అవకాశం ఉందన్నాడు. స్టార్ ప్లేయర్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారని, విండీస్ నుంచి ఇతర జట్లకు పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నాడు.
'2016లో టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరిన ఇంగ్లండ్.. 2019 ప్రపంచకప్ గెలిచి మంచి జోరు మీద ఉంది. భారత్ టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పనున్న నేపథ్యంలో టీమిండియా కూడా తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ మూడూ సెమీస్ చేరడం ఖాయం అనుకుంటే.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య నాలుగో స్థానం కోసం పోటీ తప్పదు. అయితే దక్షిణాఫ్రికాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి' అని మాజీ వికెట్ కీపర్ సబా కరీం పేర్కొన్నాడు.
ఆకాశ్ చోప్రా ఇటీవల #AskAakash పేరిట ట్విటర్లో అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు ప్రశ్నల వర్షం కురిపించారు. మీ అంచనా ప్రకారం ప్రపంచకప్ 2021 సెమీ ఫైనల్కు చేరే నాలుగు జట్లు ఏవి అని ఓ అభిమాని ప్రశ్నించగా.. 'భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్' అని ఆకాశ్ చోప్రా సమాధానమిచ్చాడు. నిజానికి ఈసారి భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు అన్ని విభాగాల్లో మంచి సమతూకంతో ఉన్నాయి. బ్యాట్స్మన్, బౌలర్, ఆల్రౌండర్లతో నిండిఉన్నాయి.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్.