అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా భారత్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఎక్కువగానే అతడిని అభిమానిస్తారు. అయితే తాజాగా అతడు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవతరించాడు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా SA20 లీగ్ జరుగుతోంది. ఈ లీగ్ లో ఎంఐ కేప్టౌన్ జట్టుకు రషీద్ ఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా పార్ల్ రాయల్స్ - ఎంఐ కేప్టౌన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన రషీద్ ఖాన్.. తద్వారా టీ20ల్లో అంతర్జాతీయ మ్యాచులు, లీగ్లు కలిపి 633 వికెట్ల మార్క్ ను టచ్ చేశాడు. ఇందులో జాతీయ జట్టు తరఫున 161 వికెట్లు పడగొట్టాడు.

472 వికెట్లు దేశవాళీతో పాటు వివిధ లీగుల్లో తీశాడు. మొత్తంగా 461 మ్యాచుల్లో 18.08 సగటుతో ఈ సరికొత్త మార్క్ ను టచ్ చేశాడు. అంతకుముందు విండీస్ మాజీ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో 631 వికెట్లు తీసి రికార్డు నమోదు చేశాడు. 582 మ్యాచుల్లో 24.40 సగటుతో ఈ ఘనత సాధించాడు.
"10 ఏళ్ల ముందు ఇలాంటి అరుదైన రికార్డును అందుకుంటానని అస్సలు ఊహించలేదు. అగ్రస్థానంలో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. టీ20ల్లో డ్వేన్ బ్రావో బెస్ట్ బౌలర్. ఇప్పుడు అతడిని అధిగమించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఇకపై కూడా ఇలానే మంచి ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాను" అని రషీద్ పేర్కొన్నాడు. ఇక రషీద్.. ఐపీఎల్ లో ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు. అంతకుముందు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున చాలా కాలం పాటు ప్రాతినిధ్యం వహించాడు.