
దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్-12 మ్యాచ్ల్లో భాగంగా మరికొద్ది సేపట్లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్ ఆడడం లేదు. స్థానంలో రీజా హెండ్రిక్స్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు విండీస్ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఒబెడ్ మెక్కాయ్ బదులుగా హేడెన్ వాల్ష్ ఈ మ్యాచ్ ఆడుతున్నాడు.
మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు తమ తొలి మ్యాచ్లో ఓడిపోయాయి. వెస్టిండీస్ను ఇంగ్లండ్ ఓడించగా.. దక్షిణాఫ్రికాను ఆస్ట్రేలియా ఓడించింది. ఈ నేపథ్యంలో సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. విజయం సాధించిన జట్టే సెమీస్ దిశగా అడుగు వేయనుంది. దాంతో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు 15 సార్లు టీ20ల్లో తలపడ్డాయి. ఇందులో దక్షిణాఫ్రికా 9 మ్యాచుల్లో గెలవగా.. వెస్టిండీస్ 6 మ్యాచులో విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్లో ఈ రెండు జట్లు మూడుసార్లు తలపడగా.. దక్షిణాఫ్రికా 2 విజయాలు అందుకుంది. మరో మ్యాచులో విండీస్ గెలిచింది.
దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. దుబాయ్లో జరిగిన గత మ్యాచులో వెస్టిండీస్ 55 పరుగులకే ఆలౌటైంది. అయితే ఇక్కడ భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మొత్తం 300కి పైగా పరుగులు వచ్చాయి. దుబాయ్ మైదానంలో 150-160 పరుగులు చేయవచ్చు. సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు మంచు కురుస్తున్న కారణంగా ప్రయోజనం ఉండడంతో తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేయాల్సిందే.
తుది జట్లు:
దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, రాసీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (కీపర్), డేవిడ్ మిల్లర్,
డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా, అన్రిచ్ నోర్జ్, తబరైజ్ షమ్సీ.
వెస్టిండీస్: లెండిల్ సిమన్స్, ఎవిన్ లూయిస్, క్రిస్ గేల్, రోస్టన్ చేజ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్ (కీపర్), కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఆండ్రీ రసెల్, అకేల్ హోసేన్, హేడెన్ వాల్ష్, రవి రాంపాల్.