South Africa: దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ 2025 చేరిన మొట్టమొదటి జట్టుగా ఆవిర్భవించింది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ చేరడం కూడా ఇదే తొలిసారి.ఇక రెండో స్థానం కోసం ప్రస్తుతానికి మూడు జట్లు పోటీ పడుతోన్నాయి. ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్ జట్లకు ఆ అవకాశం ఉంది.
సెంచూరియన్ పార్క్ స్టేడియంలో పాకస్తాన్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో ఘన విజయాన్ని సాధించింది దక్షిణాఫ్రికా. రెండు వికెట్ల తేడాతో పాక్ను మట్టికరిపించింది. గెలవడానికి అవసరమైన 147 పరుగులను అతి కష్టం మీద ఛేదించింది. ఎనిమిది వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.

ఈ విజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్స్లో బెర్త్ను ఖరారు చేసుకుంది దక్షిణాఫ్రికా. 2025 జూన్ 11వ తేదీన లండన్లోని లార్డ్స్ స్టేడియం ఈ ఫైనల్ మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఫైనల్స్లో దక్షిణాఫ్రికాను ఢీ కొట్టబోయే జట్టు ఏది అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ రేసులో ఆస్ట్రేలియా ముందంజలో ఉంది.
పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఆస్ట్రేలయా, మూడో స్థానంలో భారత్, ఫోర్త్ ప్లేస్లో న్యూజిలాండ్ ఉన్నాయి. మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్లు లభిస్తాయి ఒక్కో జట్టుకు. మ్యాచ్ టై అయితే- 6, డ్రా అయితే- 4 పాయింట్లు అందుతాయి. పాయింట్ల పర్సంటేజీ ఆధారంగా చేసుకుని ర్యాంకులను నిర్ధారిస్తుంది ఐసీసీ. ప్రస్తుతం ఈ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా 11 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
సెంచూరియన్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్లో 211, రెండో ఇన్నింగ్లో 237 పరుగులు చేసింది పాకిస్తాన్. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్లో 301 పరుగులతో రాణించింది. గెలవడానికి 147 పరుగులు అవసరం కాగా.. దీన్ని సాధించడానికి చెమటోడ్చాల్సి వచ్చింది.
ఒక దశలో 99 పరుగులకు ఎనిమిది వికెట్లను కోల్పోయింది దక్షిణాఫ్రికా. ఓటమి తప్పదనే అనుకున్నారంతా. ఆ దశలో క్రీజ్లో నిలిచిన కగిసొ రబడ, మార్కొ జెన్సెన్.. నిప్పులు చెరిగిన పాకిస్తాన్ బౌలర్లను ఎదురొడ్డి నిలిచారు. ధీటుగా ఎదుర్కొన్నారు. జట్టును విజయపథం వైపు నడిపించారు.
టోనీ డీ జోర్జీ- 2, ఎయిడెన్ మార్క్రమ్- 37, ర్యాన్ రికెల్టన్- 0, ట్రిస్టన్ స్టబ్స్- 1, కేప్టెన్ టెంబా బావుమ- 40, డేవిడ్ బెడింగ్హమ్- 14, కైలే వెర్రెయిన్- 2, కార్బిన్ బోష్- సున్నా పరుగులు చేశారు. లోయర్ మిడిలార్డర్ బ్యాటర్లు మార్కొ జెన్సెన్, కగిసొ రబడ వెన్ను చూపలేదు. మడమ తిప్పలేదు. చివరి వరకు పోరాడారు. జెన్సెన్- 16, రబడ- 31 పరుగులతో నాటౌట్గా నిలిచారు.