గెబేహా వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్పై దక్షిణాఫ్రికా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాలుగు టీ20ల సిరీస్లో 1-1తో భారత్ ఆధిక్యాన్ని సమం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. బౌలర్లకు అనుకూలించే పిచ్పై హార్దిక్ పాండ్య (39 నాటౌట్; 45 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) చెమటోడ్చాడు.
అక్షర్ పటేల్ (27; 21 బంతుల్లో, 4 ఫోర్లు), తిలక్ వర్మ (20; 20 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) పరుగులు చేశారు. మిగతా భారత బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. గత మ్యాచ్ సెంచరీ హీరో సంజు శాంసన్ డకౌటయ్యాడు. సఫారీ బౌలర్లలో మార్కో జేన్సన్, కొయెట్జీ, సిమలెనే, మార్క్రమ్, పీటర్ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 19 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.

ఓ దశలో దక్షిణాఫ్రికా 16 ఓవర్లకు 88/7తో ఓటమి అంచుల్లో నిలిచింది. కానీ ట్రిస్టన్ స్టబ్స్ (47 నాటౌట్; 41 బంతుల్లో, 7 ఫోర్లు), గెరాల్డ్ కొయెట్జీ (19 నాటౌట్; 9 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) విధ్వంసకర బ్యాటింగ్తో మ్యాచ్ను మలుపుతిప్పారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్త అయిదు వికెట్లతో పోరాడాడు. కాగా, స్టబ్స్, కొయెట్జీ దూకుడైన బ్యాటింగ్తోనే తమ జట్టు విజయం సాధించిందని సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ అన్నాడు.
''మేం చక్కగా బౌలింగ్ చేశాం. మా ప్రణాళికలను బౌలర్లు దిగ్విజయంగా అమలు చేశారు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. ఛేదన సగం వరకు గొప్పగా సాగలేదు. క్రమంగా వికెట్లు కోల్పోవడాన్ని ఆస్వాదించలేం. కానీ అంతిమంగా మా బ్రాండ్ క్రికెట్ను చూపించాం. తలెత్తుకునేలా ప్రదర్శన చేశాం. బ్రేక్ తర్వాత స్టబ్స్-కొయెట్జీ విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. ఇక బంతితో సిమలనే, పీటర్ గొప్పగా సత్తాచాటారు. ఈ యువ ఆటగాళ్లు సీనియర్లకు స్ఫూర్తి కలిగిస్తున్నారు''
''ప్రస్తుతం ఒక్కో మ్యాచ్ గురించే ఆలోచిస్తున్నాం. ఈ మ్యాచ్ గెలిచాం. సిరీస్ను 1-1తో సమం చేసి ఆనందంగా ఉన్నాం. ఇక నా గాయం గురించి చెప్పాలంటే.. నేను బాగానే ఉన్నాను'' అని మార్క్రమ్ అన్నాడు. ఫీల్డింగ్ చేస్తుండగా మార్క్రమ్ వేలుకు గాయమైంది. అంతేగాక అతని హెల్మెట్కు బంతి తాకింది. కాగా, బుధవారం సెంచూరియన్ వేదికగా మూడో టీ20 జరగనుంది. రాత్రి 8.30 గంటలకు ప్రారంభం కానుంది.