ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్గా మారాడు అభిషేక్ శర్మ. యువరాజ్ సింగ్ ప్రియ శిష్యుడిగా అంచనాలకు మించి రాణించాడు. ఎస్ఆర్హెచ్ ఫైనల్స్కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. మగధీర సినిమాలో హీరో ఎలివేషన్లా.. 30 బంతులకు మించి ఆడకుండా ప్రత్యర్థి పతానాన్ని శాసించాడు. అదే జోరులో టీమిండియాలో చోటు సంపాదించాడు.
జింబాబ్వే పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే అరంగేట్రంలో డకౌటయ్యాడు. కానీ తర్వాతి మ్యాచ్లో సెంచరీతో కదం తొక్కాడు. కానీ ఆ తర్వాత అభిషేక్ రాణించలేకపోతున్నాడు. అనంతరం ఆరు మ్యాచ్ల్లో అతడు సాధించిన అత్యధిక స్కోరు 16 మాత్రమే. రెండు సార్లు సింగిల్ డిజిట్కే పరిమతమయ్యాడు. అయితే టీమిండియా కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు అందుకున్న అనంతరం అభిషేక్కు శ్రీలంకతో టీ20 సిరీస్కు చోటు దక్కలేదు.

అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్కు భారత్ గురిపెట్టడంతో యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్ రెడ్ బాల్ క్రికెట్కు పరిమితమయ్యారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ సిరీస్కు చోటు దక్కించుకున్నాడు. కానీ అదే తడబాటు. మూడు మ్యాచ్ల్లో దాదాపు 12 సగటుతో 35 పరుగులే చేశాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో అయినా తిరిగి గాడినపడతానుకుంటే మళ్లీ పేలవమైన ప్రదర్శన చేశాడు. ఏడు పరుగులకు పెవిలియన్ బాట పట్టాడు.
టీ20 వరల్డ్ కప్ -2024 అనంతరం రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో దశాబ్ద కాలం తర్వాత భారత జట్టులో ఓపెనర్ స్థానం ఖాళీ అయ్యింది. ఈ స్థానంలో 24 ఏళ్ల అభిషేక్ శర్మ కుదురుకుంటే భారత క్రికెట్ భవిష్యత్కు కూడా ఢోకా ఉండదని సెలక్టర్లు, బీసీసీఐ భావించి వరుస అవకాశాలు ఇస్తున్నారు. కానీ అభిషేక్ చేజేతులా సువర్ణ అవకాశాల్ని నేలపాలు చేసుకుంటున్నాడు. ఓ ఓపెనింగ్ స్థానానికి యశస్వీ జైస్వాల్ దాదాపుగా ఖరారయ్యాడు.
ఇక మిగిలిన ఒక స్థానానికి పోటీ గట్టిగానే ఉంది. శుభ్మన్ గిల్, సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ప్రధానంగా రేసులో ఉన్నారు. అయితే గైక్వాడ్కు అవకాశాలు దక్కట్లేదు. గిల్ టెస్టులతో బిజీగా ఉన్నాడు. ఈ దశలో మంచి ఇన్నింగ్స్లతో అభిషేక్ ఓపెనర్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చు. కానీ పేలవమైన ఆట ఆడుతున్నాడు. మరోవైపు సంజు శాంసన్ వరుస సెంచరీలతో రోహిత్ స్థానానికి వారుసుడిగా ప్రకటించకుంటున్నాడు.