జొహనెస్బర్గ్: ఇంగ్లాండ్తో సుదీర్ఘ సిరీస్ ముంగిట దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో కరోనా వైరస్ కలకలం రేగింది. ఇప్పటికే పాజిటివ్గా తేలిన ఓ ఆటగాడితో పాటు అతనితో సన్నిహితంగా మెలిగిన మరో ఇద్దరు క్రికెటర్లను ఐసోలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం రెండోసారి నిర్వహించిన పరీక్షలో మరో ఆటగాడికి వైరస్ సోకినట్లు తేలిందని క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) స్వయంగా ప్రకటించింది. దీంతో శనివారం ఆ జట్టు ఆడాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ రద్దయింది.
కరోనా సోకిన ఇద్దరు క్రికెటర్ల పేర్లని మాత్రం క్రికెట్ దక్షిణాఫ్రికా గోప్యంగా ఉంచింది. అయితే ఇప్పుడు పాజిటివ్గా తేలిన ఆటగాడు.. మొదట వైరస్ సోకిన ఆటగాడితో సన్నిహితంగా లేడని, అతణ్ని విడిగా ప్రత్యేక ఐసోలేషన్లో ఉంచినట్లు సీఎస్ఏ తెలిపింది. వైరస్ బారినపడిన ఆటగాళ్లతో దక్షిణాఫ్రికా టీమ్ మేనేజ్మెంట్ రెగ్యులర్ టచ్లో ఉందని.. ఆటగాళ్లు ధైర్యంగా ఉన్నారని సీఎస్ఏ పేర్కొంది. ఇక సిరీస్లో పారదర్శకత కోసమే కరోనా కేసుల విషయాన్ని వెల్లడిస్తున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు చెప్పింది.
సిరీస్ ఆరంభానికి ఇక వారం రోజులే సమయం ఉండగా.. టీమ్లోని ఆటగాళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు దక్షిణాఫ్రికా మెడికల్ టీమ్ సమీక్షిస్తున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. కరోనా వైరస్ బారిన పడిన ఆటగాళ్లని ప్రస్తుతం క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సీఎస్ఏ స్పష్టం చేసింది. ఇంగ్లాండ్ టీమ్తోనూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు క్రికెట్ దక్షిణాఫ్రికా వివరించింది.
నవంబరు 27 నుంచి ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే దక్షిణాఫ్రికా గడ్డపైకి చేరుకున్న ఇంగ్లాండ్ జట్టు.. కరోనా వైరస్ పరీక్షలు చేయించుకుని ప్రాక్టీస్ కూడా మొదలెట్టింది. ఈ నెల 27న ఈ రెండు జట్ల మధ్య టీ20 సిరీస్ ఆరంభం కావాల్సి ఉంది.
ISL 2020: కేరళ బ్లాస్టర్స్పై విజయం.. మోహన్ బగాన్ బోణీ!!