
హైదరాబాద్: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్పై భారత వివాదాస్పద ఫాస్ట్ బౌలర్ ఎస్.శ్రీశాంత్ ప్రశంసలు కురిపించాడు. 20 ఏళ్ల అర్జున్లో అద్భుత ప్రతిభ ఉందని, అతడు త్వరలోనే భారత్ తరఫున ఆడతాడు అని శ్రీశాంత్ ఆశాభావం వ్యక్తం చేసాడు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో ముంబై తరఫున ఆడుతున్న అర్జున్.. ఇప్పటి వరకూ అంతర్జాతీయ స్థాయిలో ఒక్క మ్యాచ్ ఆడలేదు. కానీ తరచూ మీడియాలో అతని పేరు వినిపిస్తూనే ఉంది.
సచిన్ టెండూల్కర్ కుమారుడు కావడంతో ప్రస్తుతం మైదానంలో అర్జున్ ప్రదర్శన కంటే.. జట్టులోకి అతని ఎంపికపైనే ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. సచిన్ కొడుకు కావడంతోనే జట్టులోకి ఎంపికవుతున్నాడని ఒక వర్గం అంటుంటే.. అర్జున్ కారణంగా కొందరు ప్రతిభ ఉన్న క్రికెటర్లు మరుగునపడుతున్నారనే విమర్శలు మరో వర్గం ద్వారా వినిపిస్తున్నాయి. సచిన్ ఇటీవల 47వ సంవత్సరంలోకి అడుగుపెట్టగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన శ్రీశాంత్.. అర్జున్ గురించి కూడా ప్రస్తావించాడు.
'అర్జున్ టెండూల్కర్ అద్భుతమైన ప్రదర్శనని కనబరుస్తున్నాడు. అతని బౌలింగ్లో మంచి యాక్షన్, రిథమ్ ఉన్నాయి. తప్పకుండా అతను టీమిండియాకి ఆడతాడు' అని సచిన్తో శ్రీశాంత్ అన్నాడు. శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. 2013 ఐపీఎల్ సీజన్లో స్పాట్ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్ను బీసీసీఐ నిషేధించిన సంగతి తెలిసిందే. అతడిపై విధించిన నిషేధాన్ని గతేడాది మార్చి 15న సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ ఆగస్టుతో శ్రీశాంత్పై విధించిన నిషేధ కాలం పూర్తవుతుంది. దీంతో అతడు కేరళ, టీమిండియాకు ఆడే అర్హత సాధిస్తాడు.
ఇటీవల ఓ లైవ్ కార్యక్రమం సందర్భంగా 2011 ప్రపంచకప్ నాటి విశేషాలను గుర్తుచేసుకున్న శ్రీశాంత్.. ఆ టోర్నీలో ఆందోళన చెందానని చెప్పాడు. '2011 ప్రపంచకప్లో ఆందోళన చెందా. అదే సమయంలో సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ తన వద్దకొచ్చి ప్రోత్సహించారు. మెగా టోర్నీ స్వదేశంలో జరుగుతున్నందున జట్టులోని ప్రతీ ఒక్కరూ సచిన్ కోసమే ఎలాగైనా ప్రపంచకప్ గెలవాలని నిశ్చయించుకున్నాం. కప్ సాధించాం. వేలాది మంది అభిమానుల మధ్య ప్రపంచకప్ గెలవడం గొప్ప అనుభూతి' అని శ్రీశాంత్ పేర్కొన్నాడు. భారత జెర్సీలో అదే తన చివరి మ్యాచ్ అని గుర్తుచేశాడు.