
తిరువనంతపురం: స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఏడేళ్ల నిషేధాన్ని పూర్తి చేసుకున్న భారత పేసర్ ఎస్ శ్రీశాంత్ త్వరలోనే మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. శ్రీశాంత్ ప్రొఫెషనల్ క్రికెట్లో పునరాగమనం చేసేందుకు రంగం సిద్ధమైంది. జనవరి 10న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఆరంభంకానుండగా.. ఆ టోర్నీ కోసం ప్రకటించిన కేరళ ప్రాబబుల్స్లో శ్రీశాంత్కు చోటు దక్కింది. ఈ నేపథ్యంలోనే శ్రీశాంత్ తన సహచరుల సమక్షంలో రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కు చెందిన క్యాప్ను అందుకున్నాడు. క్రికెట్ సంఘం సభ్యులు, అధికారులకు షేక్హ్యాండ్ ఇచ్చిన శ్రీశాంత్కు చప్పట్లతో జట్టులోకి ఆహ్వానించారు.
జనవరి 10 నుంచి ముంబైలో జరిగే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ కోసం కేరళ క్రికెట్ బోర్డు (కేసీఏ) బుధవారం ప్రకటించిన జట్టులో 37 ఏళ్ల శ్రీశాంత్కు చోటు దక్కింది. దీంతో ప్రొఫెషనల్ క్రికెట్లో ఏడేళ్ల తర్వాత బరిలోకి దిగనున్నాడు. కేరళ జట్టుకు సంజు శాంసన్ నాయకత్వం వహించనున్నాడు. సచిన్ బేబీ వైస్ కెప్టెన్. బాసిల్ తంపి, జలజ్ సక్సేనా, రాబిన్ ఉతప్ప, విష్ణు వినోద్, సల్మాన్ నిజర్, నిధీష్ ఎండి మరియు ఆసిఫ్ కెఎంలు శ్రీశాంత్తో కలిసి ఆడనున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్లో శ్రీశాంత్పై విధించిన ఏడేళ్ల నిషేధం ముగిసింది. నిషేధం ముగిసిన తర్వాత అతడు ఆడే మొదటి దేశవాళీ టోర్నీ ఇదే. శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు ఆడి 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టీ20ల్లో 7 వికెట్లు తీశాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్కప్ నెగ్గిన జట్లలో శ్రీశాంత్ సభ్యుడు కావడం విశేషం.
శ్రీశాంత్ 2013 ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతూ.. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో దోషిగా తేలాడు. దీంతో బీసీసీఐ ఎలాంటి క్రికెట్ ఆడకుండా అతనిపై జీవితకాల నిషేధం విధించింది. జీవితకాల నిషేధంను శ్రీశాంత్ సవాల్ చేస్తూ కోర్టులో పోరాడాడు. హైకోర్టు కూడా అతనిపై నిషేధాన్ని సమర్థించింది. అయితే సుప్రీం కోర్టులో మాత్రం అతడికి ఊరట లభించింది. శ్రీశాంత్ను దోషిగానే గుర్తించిన సుప్రీం.. జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్మన్ డీకే జైన్ 2019లో నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరుతో శ్రీశాంత్ శిక్షాకాలం పూర్తయింది.