MI vs LSG: ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ ,లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుని ముంబై జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది. ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. లక్నో ముందు 216 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ముంబై బ్యాటర్లలో ర్యాన్ రికెల్టన్(32 బంతుల్లో 58), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 54) విజృంభించారు. విల్ జాక్స్ 21 బంతుల్లో 29 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. చివరలో నమన్ ధీర్(25), కార్బిన్ బాష్(20) పరుగులతో రాణించడంతో ముంబై జట్టు 215 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ(12), తిలక్ వర్మ(6) విఫలమయ్యారు. రోహిత్ శర్మ మయాంక్ యాదవ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. మంచి ఫామ్ లో ఉన్న రోహిత్ ను మయాంక్ తన స్లోయర్ బాల్ తో పెవిలియన్ కు పంపించాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రిన్స్ యాదవ్, దిగ్వేశ్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.