టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ రీఎంట్రీ ఇచ్చాడు. గాయంతో రెండు నెలలు ఆటకు దూరమైన రుతురాజ్ తిరిగి మైదానంలో అడుగు పెట్టాడు. రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగాడు. అయితే రీఎంట్రీ తొలి మ్యాచ్లోనే రుతురాజ్ అదరగొట్టాడు. సర్విసెస్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో కష్టాల్లో ఉన్న జట్టును ఒంటిచేత్తో ఆదుకున్నాడు. అద్భుతంగా పోరాడాడు. కానీ 96 పరుగుల వద్ద ఔటై తృటిలో సెంచరీ కోల్పోయాడు.
సర్విసెస్ బౌలర్ల ధాటికి మహారాష్ట్ర జట్టు 19 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన దిగ్విజయ్ పటేల్ (42; 75 బంతుల్లో)తో కలిసి వన్డౌన్లో వచ్చిన రుతురాజ్ కీలక భాగస్వామ్యానన్ని నమోదు చేశాడు. అయిదో వికెట్కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తర్వాత దిగ్విజయ్ ఔటైనప్పటికీ మిగిలిన బ్యాటర్లతో స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు.

అయితే సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రుతురాజ్.. పీ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు. దీంతో 161 బంతుల్లో 96 పరుగుల రుతురాజ్ గొప్ప ఇన్నింగ్స్కు తెరపడింది. కాగా, గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన విషయం తెలిసిందే. చేతివేలు గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
ఆ తర్వాత అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్కు రుతురాజ్ అందుబాటులో లేకపోయాడు. ఫిట్నెస్ సాధించి రెండు నెలల తర్వా త రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లి, గాయంతో కేఎల్ రాహుల్ దూరమవ్వడంతో రుతురాజ్ గైక్వాడ్ పేరు ట్రెండింగ్లోకి వచ్చింది. అదే సమయంలో శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ విఫలమవ్వడంతో రుతురాజ్ను జట్టులో ఎంపిక చేయాలని డిమాండ్స్ వచ్చాయి.
కాగా, ఇప్పటివరకు ఆరు వన్డేలు, 19 టీ20లు ఆడిన రుతురాజ్ టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్కు ఎంపికైనప్పటికీ గాయంతో దూరమయ్యాడు. వన్డేల్లో రుతురాజ్ 115 పరుగులు, టీ20ల్లో 500 పరుగులు చేశాడు. ఐపీఎల్లో రుతురాజ్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.