డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను సన్రైజర్స్ హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో చిత్తుచేసింది. సొంతమైదానంలో ఆల్రౌండ్ షోతో ఎస్ఆర్హెచ్ అదరగొట్టింది. అయితే చెన్నై ఓటమికి ప్రధాన కారణం ఆ జట్టు నయా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తీసుకున్న నిర్ణయాలే అని మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, మాథ్యూ హెడెన్ అభిప్రాయపడ్డారు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు సీఎస్కేకే కెప్టెన్సీ పగ్గాలను ధోనీ స్థానంలో రుతురాజ్ అందుకున్న విషయం తెలిసిందే.
తుదిజట్టులో ఉన్న ఆల్రౌండ్ మొయిన్ అలీని రుతురాజ్ బౌలింగ్ పరంగా మాత్రమే ఉపయోగించుకున్నాడని, బ్యాటింగ్లోనూ అలీకి అవకాశం ఇవ్వాల్సిందని హెడెన్ అన్నాడు. మొయిన్ అలీ ఆదిలో బ్యాటింగ్కు వస్తే చెన్నై పవర్ప్లేలో భారీస్కోరు సాధించేదని పేర్కొన్నాడు. హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే పవర్ప్లేలో 48 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 165 పరుగులు చేసింది. మొయిన్ అలీ బ్యాటింగ్కు దిగలేదు.

''కొన్ని నిర్ణయాలు నిరాశపరిచాయి. మొయిన్ అలీ బంతితో ఆకట్టుకున్నాడు. అతడిని ఆల్రౌండర్గా పరిగణిస్తున్నప్పుడు బ్యాటింగ్ ఆర్డర్లో కూడా అవకాశం ఇవ్వాలి. పవర్ప్లేలో సీఎస్కే వికెట్ కోల్పోయి 48 పరుగులు చేసింది. కాబట్టి వాళ్లకు ఆశాజనకంగా, ధైర్యంగా బ్యాటింగ్ చేసే ఆటగాడు కావాలి. మొయిన్ అలీ జట్టుకు దాన్ని అందిస్తాడు''
''అలాగే ట్రావిస్ హెడ్ను ఔట్ చేయడానికి తీక్షణకు నేరుగా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వాల్సింది. అతడిని నాలుగో ఓవర్ వరకు వేచి ఉంచారు. మరోవైపు సన్రైజర్స్ రెండో ఓవర్లోనే భారీగా పరుగులు అందుకుంది. హెడ్ కోసం తీక్షణను మొదటే బౌలింగ్ చేయించి ఉంటే సీఎస్కేకు విజయావకాశాలు మెరుగయ్యేవి'' అని హెడెన్ అన్నాడు. హెడెన్ వ్యాఖ్యలను ఇర్ఫాన్ పఠాన్ ఏకీభవించాడు. అయితే దీపక్ చాహర్, ముకేశ్ కుమార్ కొత్త బంతితో సత్తాచాటగలరని రుతురాజ్ ఆలస్యంగా తీక్షణతో బౌలింగ్ చేయించి ఉంటాడని అన్నాడు.
24 బంతుల్లో 31 పరుగులు చేసిన హెడ్ 10వ ఓవర్లో తీక్షణ బౌలింగ్ ఔటయ్యాడు. కాగా, సన్రైజర్స్ హైదరాబాద్ 18.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అభిషేక్ శర్మ 12 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. ఎయిడెన్ మార్క్రమ్ (50; 36 బంతుల్లో) అర్ధశతకంతో సత్తాచాటాడు. కాగా, సీఎస్కే బౌలర్ మొయిన్ అలీ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు.