
బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రూబెల్ హొస్సేన్ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో మాత్రం అతను కొనసాగనున్నాడు. 32ఏళ్ల రూబెల్ 2009లో వెస్టిండీస్తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి అతను 27టెస్టుల్లో బంగ్లాదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్లో 5వికెట్ల హాల్ ఓసారి సాధించాడు. ఇకపోతే ఓవరాల్గా టెస్టుల్లో 36వికెట్లు తీశాడు. అతను టెస్టుల్లో అంత పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం కాస్త ప్రభావం చూపే ప్రదర్శన కనబరిచాడు.
రూబెల్ చివరిసారిగా ఫిబ్రవరి 2020లో రావల్పిండిలో పాకిస్థాన్తో జరిగిన టెస్టులో ఆడాడు. ఆ మ్యాచ్లో 25ఓవర్ల మేర బౌలింగ్ చేసి.. 113 పరుగులిచ్చి 3వికెట్లు తీశాడు. ఆ తర్వాత అతనికి టెస్టు జట్టులో చోటు దక్కలేదు. అతను వికెట్లు తీస్తున్నప్పటికీ.. అతని ఎకానమీ రేటు మాత్రం ఎప్పుడూ బాలేదు. యువకులకు అవకాశాలను అందించడానికి తాను టెస్ట్ ఫార్మాట్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఈ మేరకు తన అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
ఇటీవలే ముష్ఫికర్ రహీమ్ ఆసియా కప్ 2022లో పేలవమైన ఆట తర్వాత టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా టెస్ట్ క్రికెట్కు రూబెల్ సైతం రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ జట్టులో రూబెల్ స్థానం పొందలేకపోయాడు. రూబెల్ టీ20 ప్రపంచకప్ 2021జట్టులో భాగంగా ఉన్నాడు.
కానీ అతనికి ప్లేయింగ్ XIలో అవకాశాలు రాలేదు. అతను ఈ సంవత్సరం టీ20 ప్రపంచకప్ 2022 జట్టుకే ఎంపిక కాలేదు. జట్టు మేనేజ్ మెంట్ యువ ఫాస్ట్ బౌలర్లకు అవకాశాలిస్తుండడంతో రూబెల్కు జట్టులో అవకాశాలు దక్కట్లేదు. ఇక సంవత్సర కాలంగా బంగ్లాదేశ్ జట్టు తరఫున రూబెల్ ఆడకపోవడంతో.. అతను మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లాయి.