సీఐసీ తీర్పుతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న బోర్డు
సీఐసీ తీర్పుతో ఇకనుంచి బీసీసీఐ కూడా జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లో భాగం కానుంది. అయితే, బీసీసీఐ మాత్రం చాలాకాలంగా తమను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవడాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. సహ చట్టం కింద ఆఫ్లైన్, ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించేందుకు 15 రోజుల్లోగా తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సీఐసీ సోమవారం ఆదేశించింది.
ఆర్టీఐ పరిధిలోకి బీసీసీఐ ఎందుకు రాకూడదు?
జూలై 10న సీఐసీ విచారణ జరిగినప్పుడు ఆర్టీఐ పరిధిలోకి బీసీసీఐ ఎందుకు రాకూడదు? అని అడిగిన ప్రశ్నకు బోర్డు నుంచి సమాధానం లేదని ఓ సీనియర్ అధికారి ఆరోపించారు. సీఐసీ తీర్పుపై ఇప్పుడు హైకోర్టులో సవాల్ చేయడం మినహా తమకు మరో దారిలేదని బీసీసీఐకి చెందిన ఉన్నతాధికాకి ఒకరు చెప్పారు.
షోకాజ్ నోటీసు జారీ చేసిన సీఐసీ
"బీసీసీఐని ఎందుకు సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురాకూడదో చెప్పేందుకు జులై 10న విచారణకు హాజరు కావాలని సీఐసీ గతంలో షోకాజ్ నోటీసు జారీ చేసింది. బీసీసీఐ కనీసం సమాధానం కూడా ఇవ్వలేదు. సీఐసీ తీర్పును సవాలు చేయడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం హైకోర్టును ఆశ్రయించి, అక్కడి నుంచి ముందుకెళ్లడమే" అని బీసీసీఐ అధికారి అన్నారు.
చట్టాన్ని సగం సగం అమలు చేయడం వీలు కాదు
"బీసీసీఐ పాక్షికంగా సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావాలనుకుంటోందని.. జట్టు సెలక్షన్, కొన్ని ఇతర అంశాల గురించి వెల్లడించకూడదని అనుకుంటోందని విన్నాం. ఇది పెద్ద జోక్. చట్టాన్ని సగం సగం అమలు చేయడం వీలు కాదు. కోర్టులో ఎలాంటి ఉపశమనం లభించదు. అమలు చేస్తే మొత్తం చేయాలి లేదంటే లేదు" అని ఆయన తెలిపారు.