ఐపీఎల్లో బలమైన బౌలింగ్ యూనిట్ ఉన్న జట్లలో ఒకటైన సన్రైజర్స్పై రాజస్థాన్ జట్టు బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ధనాధన్ షాట్లతో ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సంజూ శాంసన్ నిర్ణయం ఆ టీంకు కలిసొచ్చింది. యశస్వి జైస్వాల్ (35) ఎప్పట్లాగే వేగంగా పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే మార్కో యాన్సెన్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు.
జైస్వాల్ అవుటైన తర్వాత భారీ షాట్లు ఆడే బాధ్యతను కెప్టెన్ సంజూ శాంసన్ (38 బంతుల్లో 66 నాటౌట్) తీసుకున్నాడు. వచ్చీ రావడంతోనే ధనాధన్ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి జోస్ బట్లర్ (59 బంతుల్లో 95) మంచి సహకారం అందించాడు. వీళ్లిద్దరూ చివరి ఓవర్లలో చెలరేగారు.

బట్లర్, శాంసన్ ఊచకోతతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. అసలే బ్యాటింగ్ కష్టాలతో ఇబ్బంది పడుతున్న సన్రైజర్స్ ఈ భారీ స్కోరును ఎలా ఛేజ్ చేస్తుందో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. టోర్నీలోనే బలమైన బౌలింగ్ యూనిట్లలో ఒకటిగా పేరొందిన సన్రైజర్స్ బౌలర్లు ఈ మ్యాచ్లో మరీ తేలిపోయారు.
ఒక్కరంటే ఒక్కరు కూడా బట్లర్, శాంసన్ ఇద్దరినీ ఇబ్బంది పెట్టలేకపోయారు. ఇప్పటి వరకు టోర్నీలో చక్కగా రాణించిన మయాంక్ మార్కండే ఈ మ్యాచ్లో భారీగా పరుగులు ఇచ్చేశాడు. నాలుగు ఓవర్లు వేసిన అతను వికెట్లేమీ తీసుకోకుండా 51 పరుగులు ఇచ్చాడు. సన్రైజర్స్ బౌలర్లలో భారీగా పరుగులు ఇచ్చినా కూడా భువనేశ్వర్ కుమార్, మార్కో యాన్సెన్ చెరో వికెట్తో ఆకట్టుకున్నారు.
సన్రైజర్స్ కూడా ఈ మ్యాచ్లో కొత్తగా మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్ లేకుండా బరిలో దిగుతోంది. మరి కొత్త కుర్రాళ్లు ఈ జట్టు బ్యాటింగ్ లైనప్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తారో చూడాలి. ఈ టార్గెట్ కనుక ఛేజ్ చేస్తే సన్రైజర్స్ కనీసం పరువు నిలబెట్టుకున్నట్లు ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.