సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అనూహ్యంగా ఓటమిపాలైంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను సన్రైజర్స్ ఓడించింది. చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. బంతి అందుకున్న సందీప్ శర్మ ఈ మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు. చివరి బంతికి నోబాల్ వేసి ఆ జట్టు కొంప ముంచాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు చేసింది. జోస్ బట్లర్ (95), సంజూ శాంసన్ (66 నాటౌట్), యశస్వి జైస్వాల్ (35) ముగ్గురూ మంచి స్కోర్లు చేశారు. ముఖ్యంగా శాంసన్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 217 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ ఛేజింగ్ను సన్రైజర్స్ కూడా బాగానే మొదలు పెట్టింది.

కుర్ర ఓపెనర్లు అన్మోల్ ప్రీత్ సింగ్ (33), అభిషేక్ శర్మ (55) ఇద్దరూ అద్భుతమైన ఓపెనింగ్ అందించారు. ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠీ (47) కూడా చాలా రోజుల తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. హెన్రిక్ క్లాసెన్ (12 బంతుల్లో 26)తోపాటు గ్లెన్ ఫిలిప్స్ (7 బంతుల్లో 25) కూడా ధనాధన్ షాట్లతో చెలరేగాడు. చివర్లో అబ్దుల్ సమద్ (7 బంతుల్లో 17 నాటౌట్) ఈ మ్యాచ్ను ఫినిష్ చేశాడు.
చివరి బంతికి ఐదు పరుగులు అవసరమైన సమయంలో సందీప్ నోబాల్ వేశాడు. ఆ మరుసటి బంతికి సమద్ చక్కని షాట్తో భారీ సిక్సర్ బాదాడు. దీంతో సన్రైజర్స్ డగౌట్ సంబరాల్లో మునిగిపోయింది. ఈ ఓటమిపై సంజూ శాంసన్ స్పందించాడు. 'ఇలాంటి మ్యాచులే ఐపీఎల్ను చాలా స్పెషల్గా మారుస్తాయి. మ్యాచ్ గెలిచే వరకూ ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు' అని చెప్పాడు.
'సందీప్పై నాకు మంచి నమ్మకం ఉంది. కానీ ఆ నోబాల్ చాలా దెబ్బతీసింది. అయితే దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. సన్రైజర్స్ చాలా బాగా బ్యాటింగ్ చేశారు. ఆ విషయంలో వారిని కచ్చితంగా మెచ్చుకోవాలి. ఈ ఫార్మాట్లో, ముఖ్యంగా ఈ టోర్నీలో ఆడటం అంత ఈజీ కాదు. ప్రతి గేమ్లో మనం మన బెస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాతి మ్యాచ్లో మరింత పుంజుకొని రాణిస్తాం' అని చెప్పుకొచ్చాడు.