ప్లేఆఫ్స్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ రెడీ అవుతున్నాయి. జైపూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ రేసులో చాలా ముందంజ వేస్తుంది. ఇలాంటి సమయంలో ఆర్సీబీ జట్టు మొత్తం సమస్యల కుప్పలా మారింది.
అదే సమయంలో రాజస్థాన్ జట్టు మాత్రం సరైన టైంకి మంచి ఫామ్ అందుకుంది. దానికితోడు మ్యాచ్ జరుగుతోంది జైపూర్లో కావడం కూడా వారికి కలిసొస్తుంది. ప్రస్తుతం ఆర్సీబీ బ్యాటింగ్ భారం అంతా ఇద్దరు, ముగ్గురు ప్లేయర్లే మోస్తున్నారు. మిడిలార్డర్ పూర్తిగా విఫలం అవుతోంది.

ఇక బౌలర్ల గురించి కూడా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ జట్టు ఆడిన చివరి నాలుగు మ్యాచుల్లో మూడింట ఘోరంగా ఓడిపోయింది. వీటిలో ఆర్సీబీ బౌలింగ్ ఏమాత్రం ప్రభావం చూపలేదు. సీజన్ ఆరంభంలో అదరగొట్టిన మహమ్మద్ సిరాజ్ చివరి రెండు మ్యాచుల్లో తేలిపోయాడు. వానిందు హసరంగ తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇప్పటి వరకు ఇవ్వలేదు.
అదే సమయంలో రాజస్థాన్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. ఇక యశస్వి జైస్వాల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సంజూ శాంసన్ కూడా నెమ్మదిగా తన బెస్ట్ ఫామ్ కనబరుస్తున్నాడు. చివర్లో ధృవ్ జురెల్ కూడా తనకు వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకుంటున్నాడు.
ఇక రాజస్థాన్ బౌలింగ్ విషయానికొస్తే ట్రెంట్ బౌల్ట్ అదరగొడుతున్నాడు. సీజన్ ఆరంభంలో ఫామ్ లేనట్లు కనిపించిన యుజ్వేంద్ర చాహల్ గాడిన పడ్డాడు. రాజస్థాన్ ఆడిన చివరి రెండు మ్యాచుల్లో అతను 8 వికెట్లతో చెలరేగాడు. జైపూర్లో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ జట్టు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది.
రాజస్థాన్, బెంగళూరు జట్లు చివరగా ఆడిన మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించింది. ఆ మ్యాచ్లో మ్యాక్స్వెల్, డుప్లెసిస్ మూడో వికెట్కు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. వీళ్లిద్దర్నీ కనుక రాజస్థాన్ త్వరగా అవుట్ చేయగలిగితే ఆ జట్టు గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆర్సీబీ మిడిలార్డర్ ఈ సీజన్లో ఏమాత్రం ప్రభావం చూపలేదు.
ప్రస్తుతం రెండు జట్లు ఉన్న ఫామ్.. ఆటగాళ్లు గాడిన పడటం అన్ని విషయాలు పరిగణిస్తే ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఫేవరెట్గా బరిలో దిగుతోంది. జైపూర్లో సంజూ సేన మరోసారి కమాండింగ్ విక్టరీ సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలవాలంటే జట్టులోని అందరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.